వివేకా హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ- కడప పోలీసులతో మొదలు...
ఏపీలో తీవ్ర కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... ఇవాళ కడపలో అడుగుపెట్టారు. ముందుగా కడప ఎస్పీ కార్యాలయనికి వెళ్లిన అధికారులు.. ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. వివేకా హత్యకు దారి తీసిన పరిస్ధితులను, హత్యలో పాల్గొన్న వారి ప్రాథమిక వివరాలను వారి నుంచి తీసుకున్నారు. అనంతరం వారు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు.
వైఎస్ వివేకా హత్యోదంతానికి ఏడాది: జగన్ చేతిలో అధికార పగ్గాలు: అయినా తేలని కేసు: సీబీఐ
2019 మార్చి 15న పులివెందుల శివార్లలోని తన సొంత ఇంటిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ముందుగా వైఎస్ కుటుంబ సభ్యులు ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పడం, ఆ తర్వాత బాత్ రూమ్ లో కాలుజారి పడ్డారని చెప్పడం, చివరికి వివేకా మృతదేహంపై గాయాలు, మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి రక్తపు మరకలు తుడిచేయడానికి జరిగిన ప్రయత్నాలో ఈ కేసు సీరియస్ వ్యవహారంగా మారిపోయింది.
వైఎస్ కుటుంబ సభ్యుడు కూడా కావడంతో పాటు అప్పటి విపక్ష నేతగా ఉన్న జగన్ బాబాయ్ కావడంతో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ జగన్ కుటుంబం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. చివరకు అధికారం టీడీపీ నుంచి వైసీపీకి మారిన తర్వాత సీబీఐ దర్యాప్తు మొదలుకాకపోవడంతో ఏకంగా వివేకా కుటుంబంతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలైంది.