వివేకా హత్య కేసులో సీబీఐ చేతికి కీలక ఆధారాలు ? రేపు వైఎస్ కుటుంబ సభ్యుల విచారణ...
కడప : మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు సాగుతున్న దర్యాప్తులో పలు కీలక ఆధారాలను సంపాదించిన సీబీఐ.. వీటి ఆధారంగా రెండో దశ దర్యాప్తుకు రంగం సిద్దం చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో వివేకా కుటుంబ సభ్యులను మాత్రమే ప్రశ్నించిన సీబీఐ రాబోయే రెండు రోజుల్లో మిగతా వారిని ప్రశ్నించబోతోంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
వివేకా కేసులో సీబీఐ జోరు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఇప్పటికే వివేకా ఇంటిని పలుమార్లు స్కాన్ చేసిన సీబీఐ టీమ్ లు, స్ధానిక పోలీసులు, అధికారుల సాయంతో మ్యాప్ గీయడం, సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశాయి. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్యతో పాటు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిని కూడా సీబీఐ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. ఇందులో పలు కీలక విషయాలను సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా దర్యాప్తు మరింత వేగవంతమవుతుందని తెలుస్తోంది.
రేపు వైఎస్ కుటుంబ సభ్యుల విచారణ..
రేపు ఈ కేసులో కీలకమైన వైఎస్ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించేందుకు సీబీఐ రంగం సిద్దం చేస్తోంది. పులివెందులలో వివేకా హత్య జరిగినప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు అక్కడికి మందుగా వెళ్లారు. ఆ సమయంలో వారు వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు బయటి ప్రపంచానికి వెల్లడించారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ తర్వాత బాత్రూమ్ లో కాలు జారి పడ్డారని చెప్పారు. చివరికి వివేకాది దారుణ హత్యగా తేలింది. దీంతో అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన వైఎస్ కుటుంబ సభ్యులు ముందుగా ఈ విషయాన్ని ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నించారనే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగుతోంది.
Recommended Video
ఆధారాల మ్యాచింగ్...
వివేకా హత్య కేసులో ఇప్పటికే పలు కీలక ఆధారాలు సంపాదించిన సీబీఐ... వైఎస్ కుటుంబ సభ్యుల వాంగ్మాలాల నమోదు సందర్భంగా వీటిని నిర్ధారించుకోబోతోంది. ఈ కేసు దర్యాప్తులో వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు కీలకంగా మారడంతో అందరి చూపూ రేపటి విచారణపైనే నెలకొంది. ఇప్పటికే వివేకా వద్ద పనిచేసిన డ్రైవర్, సహాయకుడు చెప్పిన అంశాలను వైఎస్ కుటుంబ సభ్యుల వాదనతో మ్యాచ్ చేసి చూడాలని సీబీఐ భావిస్తోంది. ఇందులో భిన్న వాదన వ్యక్తమైతే అది కేసు దర్యాప్తు మొత్తానికి కీలకమవుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో సీఎంగా జగన్ ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం, నేరుగా కుటుంబ సభ్యులను ప్రశ్నించడానికి సీబీఐ సిద్దం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.