వివేకా కేసు దర్యాప్తులో మరో ట్విస్ట్- సీబీఐ ప్రత్యేక నేరాల విభాగానికి బదిలీ- తాజా ఎఫ్ఐఆర్..
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు సంచలనం రేపుతున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు కరోనా బారినపడటంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. త్వరలో మరో బృందం ఈ కేసు దర్యాప్తు ప్రారంభించబోతోంది. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కొత్త ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ దర్యాప్తు సాగబోతోంది. అయితే సదరు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు కొత్త ట్విస్ట్ ఇచ్చాయి.
ఈ ఏడాది జూలై 9న సీబీఐ వివేకానందరెడ్డి హత్య కేసుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీలోని ప్రత్యేక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విభాగంలోని మూడో బ్రాంచికి కేసు దర్యాప్తును అప్పగించారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ సెక్షన్ 174 ప్రకారం మృతికి కారణం తెలియదంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత సీబీఐ ఎఫ్ఐఆర్లో అధికారులు దీన్ని హత్యగా నమోదు చేశారు.
వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఢిల్లీలోని ప్రత్యేక నేరాల విభాగం మూడో బ్రాంచి డీఎస్పీ దీపక్ గౌర్ను నియమించారు. ప్రస్తుతం సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో దర్యాప్తు వాయిదా పడుతూ వస్తోంది. త్వరలో డీఎస్పీ దీపక్ గౌర్ ఆధ్వర్యంలో దర్యాప్తు తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ హత్యగా కాకుండా హైప్రొఫైల్ హత్యగా భావించడం వల్లే ఇలా ప్రత్యేక నేరాల విభాగానికి ఈ కేసు దర్యాప్తు అప్పగించారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.