ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!
అమరావతి/హైదరాబాద్ : దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు పక్షపాతి ఐన రాజశేఖర్ రెడ్డి గుర్తింపుగా రైతు దినోత్సవం నిర్వహించాలని ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఏపి లో ఉన్న యావత్ రైతు లోకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరాలు ప్రకటించనున్నారు. అందులో బాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో రైతుల సమక్షంలో జగన్ భారీ బహిరంగ సభకు రంగం చేస్తున్నారు. సభలో రైతులకు జగన్ ఊహించని వరాలు కురిపించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
వైఎస్సార్ పింఛన్ పథకానికి శ్రీకారం..!ఈ నెల 8 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం..!!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8 తేదీన(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతు సాధికారత కోసం కృషి చేసిన వైఎస్సార్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రైతు దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగనున్నాయి. నియోజకవర్గానికి లక్ష రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రైతు దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
జగన్ గొప్ప మనసు .. నాడు వైఎస్ తో పాటు చనిపోయిన ఐఏఎస్ కుమార్తెకు గ్రూప్1 జాబ్ ఇచ్చిన జగన్ సర్కార్
రైతు దినోత్సవానికి సన్నాహాలు..! జమ్మలమడుగు సభకు హాజరు కానున్న ఏపి సీఎం..!!
రైతు దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జమ్మలమడుగులో రైతు దినోత్సవ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ పింఛన్ పథకాన్ని ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సభలో రైతన్నల సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అన్నదాతల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు.
వైఎస్సార్ పింఛన్ పథకానికి శ్రీకారం..! రైతు సంక్షమంపై కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం..!!
పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయల చొప్పున అందించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్లో మొదలయ్యే రబీ నుంచే ప్రారంభిస్తున్నారు. ఉచిత బోర్ల పథకాన్ని, ఉచిత పంటల బీమా, పెట్టుబడి సాయాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోబోతున్నారు.
సభావేదిక ప్రాంతం ఖరారు..! ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ శ్రేణులు..!!
జమ్మలమడుగులో నిర్వహించబోయే రైతు దినోత్సవ సభావేదిక ప్రాంతాన్ని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ గురువారం పరిశీలించారు. ముందుగా ముద్దనూరు రోడ్డులో ఉన్న పతంగే రామన్నరావు క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జమ్మలమడుగు పట్టణానికి మొదటిసారిగా వస్తుండటంతో ఈ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఈ ప్రాంగణం సరిపోదని స్థానిక నాయకులు సూచించారు. దీంతో ముద్దనూరు రోడ్డులోని రోజా టవర్స్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం అందరికీ ఆమోద యోగ్యం కావడంతో అక్కడే ముఖ్యమంత్రి సభావేదికను ఖరారు చేశారు. హెలిప్యాడ్ కోసం సభావేదిక ప్రాంతం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు.