జగన్ కు సొంత నియోజకవర్గంలో షాక్ .. పట్టాల పంపిణీకి బ్రేక్ .. బాధగా ఉందన్న సీఎం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుండగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ,పులివెందుల నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కి బ్రేక్ పడింది. పులివెందులలో ఇళ్ల పట్టాలు పంపిణీ పై హైకోర్టుకు వెళ్లి ఓ వ్యక్తి స్టే తీసుకు వచ్చిన క్రమంలో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగడం లేదు. దీనిపై పులివెందులలో సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే పట్టాలు ఇచ్చి తీరుతాం అంటూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపలేరు అంటూ సవాల్ చేశారు.
Recommended Video
జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వెయ్యాలంటున్న టీడీపీ నేతలు .. చెత్తపాలన అంటూ ఫైర్
పులివెందులలో పట్టాల పంపిణీకి బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటికి అనేక మార్లు వాయిదా పడింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ ముహూర్తం నిర్ణయించడం, ఆ తర్వాత ఎవరో ఒకరు కోర్టులకు వెళ్లి, ఇళ్ల పట్టాల పంపిణీ కి బ్రేక్ చేయడం పరిపాటిగా మారింది. అయితే ఇప్పటివరకు రాజధాని అమరావతి వంటి ప్రాంతాల పైనే ప్రధానంగా దృష్టి పెట్టి పట్టాల పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేసిన వారు, ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జగన్ కు షాక్ ఇచ్చారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి పులివెందులలో పట్టాల పంపిణీ అడ్డుకున్నారు.
ఇళ్ళ పట్టాల పంపిణీకి ముందు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. రాజమండ్రిలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రోజు ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుంది .ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే క్రిస్మస్ పర్వదినం కావడంతో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.ఇళ్ల స్థలాల పంపిణీకి ముందు క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో సీఎం జగన్ తో పాటు సీఎం సతీమణి వైయస్ భారతి, వైయస్ విజయమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పులివెందుల పట్టాల పంపిణీ పై సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా ఇచ్చి తీరుతామన్న జగన్
ప్రార్థనల అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, కాకుంటే ఈరోజు పులివెందులలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఎవరో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని సీఎం జగన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి అయినా సరే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని సవాల్ చేశారు. ఏపీఐఐసీ లో పరిశ్రమలు వస్తే ఉపాధి లభిస్తుందని, ఆ భూములలో అక్కడ పని చేసే కార్మికులకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, అందుకే అక్కడ ఉన్న పేదలకు ఇళ్లు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి జరిగే సమయంలో ఇలాంటి ఆటంకాలు వస్తాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా సరే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సాటి మనుషుల పట్ల ప్రేమ , నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత పులివెందుల నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. నేడు ఇప్పటికి చాలా సార్లు పెండింగ్ గా ఉండిపోయిన నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతుంది .