నేటి నుండి కడప జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన..షెడ్యూల్ ఇదే!!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పై దృష్టి సారించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజులపాటు సొంత జిల్లాలో పర్యటించనున్న జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ ఇలా సాగనుంది.
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. నేడే ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
23వ తేదీనఉదయం 10 గంటలకు జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప ఉక్కు కర్మాగారమైన ఏపీ హై గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత జమ్మలమడుగు లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుందు నది పై కుందు- తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కర్నూలు వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దులో నిర్మిస్తున్న రాజోలి ఆనకట్టను నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాసి వద్ద నిర్మించనున్న ఆనకట్ట కు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన ఫలకాలను ఆవిష్కరిస్తారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం నేలటూరు వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఇక 23వ తేదీ సాయంత్రం కడప లో రిమ్స్ పరిధిలో 107 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ను 175 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని, 40 .80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. 20 కోట్లతో కడపలో నిర్మించనున్న పోలీస్ కార్యాలయం భవనాలకు శంకుస్థాపన చేస్తారు. కడప రాయచోటి రోడ్డు లో 82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. కమలాపురం ఎమ్మెల్యే నాథ్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన ఉచిత అన్నదాన వసతి భవనాన్ని కూడా ప్రారంభిస్తారు.
25న రాయచోటిలో జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
24వ తేదీన సీఎం జగన్ పర్యటన చూస్తే రాయచోటి ప్రాంతంలోని 1272 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాయచోటి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
25న పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన
25వ తేదీన పులివెందులలో 347 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అంతేకాదు 17.50 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి కడప జిల్లా పై ప్రత్యేకమైన దృష్టి సారించారు. వేల కోట్ల నిధులతో ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో కడప వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి సీఎం జగన్ మూడు రోజుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో, జిల్లాలోని వైసీపీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కడప వాసులు సైతం సీఎం జగన్ పాలన పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.