రెండు రోజులే డెడ్ లైన్..చిన్నాన్న హత్య కేసు తేల్చాలి : సీఎం జగన్ ఫైర్: రంగంలోకి డీజీపీ..!!
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై ఆరు నెలలు గడుస్తోంది. ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు నిందితులు ఎవరన్నది తేలడంలేదు. ఈ హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ వస్తోంది. దీని పైన రాజకీయ విమర్శలే కాదు. ముఖ్యమంత్రి జగన్ కు సొంత కుటుంబ సభ్యులు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం జగన్ తన తండ్రి వర్దంతి రోజు పులివెందులకు వెళ్లారు. అక్కడ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలోనే హత్య కేసు సూత్రధారులు ఎవరో ఇంకా తేలకపోవటం పైన వారు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో..జగన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి ఫైర్ అయ్యారు. రెండు రోజుల్లో హత్య కేసు మిస్టరీ తేల్చాల్సిందేనంటూ ఆదేశించారు. వెంటనే డీజీపీ కడపకు బయల్దేరారు. అక్కడ స్వయంగా విచారణ పర్యవేక్షిస్తున్నారు.
శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యపై పోలీసుల షాకింగ్ వివరణ .. సూసైడ్ నోట్స్ పై అనుమానాలు , రహస్య విచారణ
రెండు రోజులే సమయం..సీఎం డెడ్ లైన్...
పులివెందుల వెళ్లిన ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసిన సమయంలో వివేకా హత్య జరిగి ఆరు నెలలు గడుస్తున్నా..ఇంకా దోషులు ఎవరో తెలియక పోవటం పైన చర్చ సాగింది. వెంటనే దోషులను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు జగన ను కోరినట్లు సమాచారం. వెంటనే జగన్ అక్కడి నుండే డీజీపీతో మాట్లాడారు. ప్రముఖ వ్యక్తి హత్య జరిగి ఆరు నెలలు అవుతుంటే ఇప్పటి వరకు అసలు దోషులెవరో ఎందుకు పట్టుకోలేపోయారంటూ ఫైర్ అయ్యారు. మీరే స్వయంగా విచారణ చేయండి. రెండు రోజులే మీకు సమయం ఇస్తున్నా. చిన్నాన్న ను చంపిన వారు ఎంత పెద్దవారైనా వదలద్దు. వారిని బయట పెట్టండి. వారికి మా పార్టీతో సంబంధం ఉన్నా..మరే పార్టీతో సంబంధం ఉన్నవారైనా సరే...వెంటనే బహిర్గతం చేయాలి అంటూ హుకుం జారీ చేసారు. సిట్ ఏం విచారణ చేస్తోంది.. 1300 మంది నిందుతులు..అనుమానితులను విచారించి ఏం తేల్చారు అంటూ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆగ్రహంతో డీజీపీ వెంటనే రంగంలోకి దిగారు. రోడ్డు మార్గంలోనే కడపకు వెళ్లారు. అక్కడ జిల్లా పోలీసు కార్యాలయంలో వివేకా హత్య కేసు విచారణ పైన స్వయంగా పర్యవేక్షణ ప్రారంభించారు.
పులివెందులలో ఏం జరిగింది..
ఈ నెల 2వ తేదీన వైయస్సార్ వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇడుపుల పాయకు వెళ్లారు. అక్కడ వైయస్సార్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆ తరువాత పులివెందులలో వైయస్ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ వెంటనే వివేకా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పటి వరకు అసలు బాధ్యులు ఎవరో తేల్చకపోవటం పైన వారు ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హత్య జరిగి ఆరు నెలలు పూర్తవుతున్నా..ఎందుకు తాత్సారం జరుగుతందనే దాని పైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో రాజకీయంగానూ టీడీపీ..జనసేన అధినేత పవన్ సైతం ఈ హత్య కేసును తేల్చకపోవటం పైన విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక జగన్ మనుషులు ఉన్నారనే విధంగా వారి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హాయంలో ఈ హత్య విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు పూర్తయింది. ఇప్పటికీ కేసులో అసలు దోషులు ఎవరో తేల్చకపోవటం పైన రాజకీయంగానే కాకుండా కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
శ్రీనివాస రెడ్డి ఆత్మహత్యతో మరింత వేగంగా..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. విచారణ పేరుతో సిట్ పోలీసులు వేధించడంతోనే తన భర్త ప్రాణాలు వదిలాడని మృతుడి భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోక ముందే కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుతో రెండు లేఖలు దొరకడం చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్, వైఎస్ భాస్కర్రెడ్డిలకు వేర్వేరుగా రాసిన లేఖలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో..పోలీసుల మీద మరింత ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ రంగంలోకి దిగారు. అసలు ఘటన జరిగిన సమయం నుండి ఇప్పటి వరకు విచారణ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి సీరియస్ గా ఉండటంతో దీనికి ఎలాగైనా తేల్చేయాలనే పట్టుదలతో పోలీసులు కేసు విచారణ వేగవంతం చేసారు.