ముచ్చటగా మూడోసారి: నేడే కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన..చిరకాల స్వప్నం సాకారం అవుతుందా?
కడప వాసుల దశాబ్దాల కల కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసుకుంది. నాటి సీఎం వై ఎస్సార్, చంద్రబాబు శంకుస్థాపనలకే పరిమితం కాగా నేడు ముచ్చటగా మూడోసారి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారానికి భూమిపూజ చేస్తారు. అనంతరం జమ్మలమడుగులో ఏర్పాటు చేసే బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు.
కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అడుగులు వేశారు .ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు జగన్ . రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటు
ఈ కర్మాగారానికి కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. దీని ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 20వేల మందికి ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్ను మూడేళ్లలోనే పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం జగన్ ప్రకటించిన నేపధ్యంలో కడప వాసుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన ... ఈ సారైనా కలిసొస్తుందా ?
పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మరీ నిర్దేశించడంతో, కడప మరియు పొరుగు జిల్లాల్లోని అనేక మంది నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. కడపలో ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేయడం ఇది మూడోసారి. మాజీ ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేసినప్పటికీ, దురదృష్టవశాత్తు అవి కార్యరూపం దాల్చలేదు. ముచ్చటగా మూడవ సారి జగన్ శంకుస్థాపన చేస్తున్న నేపధ్యంలో తమకు అదృష్టం కలిసివస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో ఉక్కు కర్మాగార ఏర్పాటు
2013 కంపెనీల చట్టం ప్రకారం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వమే పెడుతున్నట్టు తెలుస్తుంది. కేంద్రం ఉక్కు కర్మాగార ఏర్పాటుపై మీనా మేషాలు లెక్కపెడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగార ఏర్పాటుకు ముందుకు వచ్చింది. స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇందుకోసం ఇనుప ఖనిజాన్ని ఎన్ఎమ్డిసి నుండి సరఫరా చేయడానికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద నేడే శంకుస్థాపన
విభజన హామీ చట్టం ప్రకారం కడప జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది . మొత్తానికి నేటి నుండి మూడు రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ఉదయం 10 గంటలకు కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చెయ్యనున్నారు.