జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ విడుదల: జగన్ సర్కార్ నాలుగేళ్లే: మరిన్ని కేసులు
కడప: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జైలు నుంచి విడుదల అయ్యారు. వాహనాల ట్యాంపరింగ్, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన వారిద్దరూ కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొన్నారు. రెండు రోజుల కిందటే అనంతపురం జిల్లా న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ప్రొసీజర్లను ముగించుకున్న అనంతరం కడప కేంద్ర కారాగారం అధికారులు వారిని విడుదల చేశారు.
54 రోజుల పాటు కడప సెంట్రల్ జైలులో..
54 రోజుల పాటు వారు కడప సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొన్నారు. అనంతపురం జిల్లా జైలులో కరోనా పాజిటివ్ వచ్చిన ఖైదీలు ఉండటం వల్ల అనంతపురం జిల్లా న్యాయస్థానం ఆదేశాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను విచారణ కోసం కడప కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. వారిద్దరి విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జేసీ అభిమానులు తాడిపత్రి, అనంతపురం నుంచి పెద్ద ఎత్తున కడపకు తరలివచ్చారు.
కడపకు తరలివచ్చిన కార్యకర్తలు
కేంద్ర కారాగారం వద్ద గుమికూడారు. సుమారు 20కి పైగా వాహనాలతో వారు అనంతపురం నుంచి కడపకు చేరుకున్నారు. వారితో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై జూన్ 13వ తేదీన పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో వారిని అరెస్టు చేశారు. అనంతపురానికి తీసుకుని వచ్చారు.
కరోనా పాజిటివ్ ఖైదీల వల్ల కడపకు..
అనంతపురం జిల్లా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారికి తొలుత 14 రోజుల పాటు రిమాండ్కు పంపించింది. విచారణ కోసం అనంతపురం జిల్లా జైలులో వారిని ఉంచాలని మొదట్లో పోలీసు అధికారులు భావించారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఖైదీలు అక్కడ ఉండటంతో రాత్రికి రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప కేంద్ర కారాగారానికి పంపించారు. ఇన్ని రోజుల పాటు అక్కడే విచారణ కొనసాగింది.
ఎట్టకేలకు బెయిల్..
బెయిల్ కోసం ఇప్పటికే మూడుసార్లు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. విచారణ కొనసాగుతున్నందు వల్ల అనంతపురం జిల్లా న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయలేదు. రెండు రోజుల కిందటే వారు మరోసారి బెయిల్ కోసం ప్రయత్నించారు. పోలీసుల అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనితో వారు కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు.
Recommended Video
కక్షసాధింపులకు పాల్పడుతోన్న జగన్
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటుందని, ఈ కాలంలో తమపై మరిన్ని కేసులను నమోదు చేస్తుందని ఆరోపించారు. కక్షసాధింపు రాజకీయాలకు తాము భయపడబోమని అన్నారు. అధికార పార్టీని ఎదిరించి, నిలుస్తామని చెప్పారు. తమ వ్యాపారాలను అడ్డుగా పెట్టుకుని రాజకీయంగా పగ తీర్చుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.