ఘోర రోడ్డు ప్రమాదం... మూడు వాహనాలు ఢీ... నలుగురు సజీవదహనం...
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వల్లూరు మండలం గోటూరు సమీపంలో . టిప్పర్, స్కార్పియో, మరో కారు ఢీకొన్నాయి. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో స్కార్పియో వాహనంలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కడప-తాడిపత్రి రహదారిపై గోటూరు-తోళ్ల గంగన్న పల్లె మధ్యలో సోమవారం(నవంబర్ 2) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... హుటాహుటిన ఫైరింజన్స్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. అదే స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలు కూడా బయటపడటం గమనార్హం. అక్రమంగా ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే స్కార్పియోలో చెలరేగిన మంటలకు ఎర్రచందనం దుంగలు కాలిబూడిదైనట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో ఇటీవల ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు దర్మరణం చెందారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
శనివారం(అక్టోబర్ 31) అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో రెండు బైకులు,ఒక కారు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఒకరిని స్థానిక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) ఆస్పత్రి వైద్యురాలిగా గుర్తించారు.