కడప జిల్లాలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు: మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్న ఫ్రెంచ్ సంస్థ.. !
కడప: కడప జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. గత ఏడాది డిసెంబర్లో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన తరువాత ఆ స్థాయిలో మరో ప్రాజెక్టు రాబోతోంది. జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఫ్రెంచ్ సంస్థ ముందుకొచ్చింది. 250 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాన్ని కడప జిల్లాలో స్థాపించబోతున్నట్లు ఫ్రెంచ్ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సంస్థ ఈఎన్జీఐఈ వెల్లడించింది.
2017లో ఈ సంస్థకు భూమిని కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో 200 మెగావాట్ల మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయడానికే అనుమతి లభించింది. అనంతరం వైఎస్ జగన్ సర్కార్.. దీన్ని విస్తరించడానికి అనుమతి ఇచ్చింది. అదనంగా మరో 50 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అనుమతులను మంజూరు చేసింది. 200 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో.. త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని చేపట్టడానికి ఫ్రెంచ్ సంస్థ సన్నాహాలు చేపట్టింది.
ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి విక్రయిస్తుందా ఫ్రెంచ్ సంస్థ. దీనికోసం ఎన్టీపీసీతో 25 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇన్నాళ్లు బొగ్గు ఆధారిత విద్యుత్ను మాత్రమే ఉత్పత్తి చేయడానికి పరిమితమైన ఎన్టీపీసీ.. తాజాగా సౌర విద్యుత్ కేంద్రంలోనూ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మిర్జాపూర్ వద్ద భారీ సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపించనుంది.
Recommended Video
ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో సౌర, పవన విద్యుత్ కేంద్రాలు భారీ స్థాయిలో ఏర్పాటు అయ్యాయి. క్రమంగా కడప జిల్లాలో పవన్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇదివరకు జిల్లాలోని గాలివీడు మండలంలో తొలిసారిగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటైంది. కొత్తగా ఫ్రెంచ్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టింది. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనంతపురం, కడప జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉండటంతో ఈ రెండింటినీ ప్రోత్సహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.