సీఎం జగన్ సొంతజిల్లాలోనే దారుణం; బాలికపై సామూహిక అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలపై అమానుష ఘటన చోటు చేసుకుంటున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

జగన్ సొంత జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలోనే చోటుచేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంత కాలంగా ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన, ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

గర్భం దాల్చిన బాలిక .. విషయం వెలుగులోకి
ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాం పురం వీధిలోని మసీదు వద్ద ఓ బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. చాలా కాలం క్రితం తల్లి చనిపోయిన సదరు బాలిక తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు. అయితే ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ డెకరేషన్ దుకాణంలో పని చేస్తున్న యువకుడి కన్నుపడింది. ఆ యువకుడు, తన స్నేహితులతో కలిసి గత కొంత కాలంగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాలిక పై సామూహిక అత్యాచార ఘటన బయటకు రాకుండా పోలీసుల చర్య
ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన ఓ మహిళా కానిస్టేబుల్ బాధిత బాలిక తో మాట్లాడి అన్ని వివరాలను సేకరించింది. బాలిక తన పై జరిగిన అత్యాచారానికి సంబంధించిన విషయాన్ని ఆ మహిళా కానిస్టేబుల్ కు వివరించింది. తనపై అత్యాచారం చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తాను చెప్పినప్పటికీ వారి ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అంటూ తనపై లైంగిక దాడికి దిగారని బాలిక చెప్పింది. ఇక ఈ విషయాన్ని మహిళా కానిస్టేబుల్ సిఐ దృష్టికి తీసుకువెళ్లగా బాధిత బాలికను ఈనెల 8వ తేదీన మైలవరం లోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు.

బాలిక అత్యాచార ఘటనపై నమోదు కాని కేసు
బాలిక పై అత్యాచారానికి పాల్పడిన వారిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. భిక్షాటన చేసే బాలిక కాబట్టి పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మొదట అలాంటిదేమీ లేదని చెప్పిన డీఎస్పీ వై. ప్రసాదరావు, ఆపై ఘటనపై విచారణ జరుపుతున్నామని , బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పినట్టు సమాచారం.

వైద్య పరీక్షల అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పిన డీఎస్పీ
వైద్య నివేదికల తర్వాత సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనలను కట్టడి చేయడంలో ఏపీ పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న వేళ సీఎం సొంత జిల్లాలోనే బాలికలకు రక్షణ లేదన్న చర్చ జరుగుతుంది.