వామ్మో.. వరుడికి కరోనా పాజిటివ్, వివాహమైన కొద్ది గంటలకు రిపోర్ట్, పెళ్లికి హాజరైన 46 మంది...
వైరస్ వల్ల వివాహాలు, వేడుకలు అంటే హడలెత్తే పరిస్థితి. అత్యవసరం.. దగ్గరి బంధువులైతే తప్ప బయటకి వెళ్లలేని పరిస్థితి. అలా కొందరు పెళ్లికి హాజరు కాగా.. ఏకంగా వరుడికే కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బంధువులు, కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆ వివాహానికి వచ్చిన 46 మందిని అధికారులు గుర్తించారు. కడప జిల్లాలో కొత్తమాధవరంలో గురువారం పెళ్లి జరిగింది. తర్వాత పెళ్లి కూతురు ఇంటికి వెళ్లగా.. వరుడికి పాజిటివ్ అని తేలడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనకు గురయ్యారు.
కొత్తమాధవరానికి చెందిన యువకుడికి నెల్లూరు జిల్లా గూడురికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. కరోనా నిబంధనల మేరకు మూడురోజుల క్రితం వరుడి కుటుంబసభ్యులు ఒంటిమిట్ట మండల అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అంతుకుముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరడంతో.. ఫ్యామిలీ మెంబర్స్ రక్త నమూనాలను ఇచ్చారు. కానీ ఫలితం మాత్రం గురువారం మధ్యాహ్నం వచ్చాయి.
ఫలితం వచ్చేలోపు వారి పెళ్లి జరిగిపోయింది. గురువారం ఉదయం పెళ్లి కాగా.. వరుడు వధువు ఇంటికి వెళ్లిపోయాడు. పెళ్లి కొడుకుకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కవిత మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. అత్తగారింట్లో ఉన్న వరుడికి కడప కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి హాజరైన వారి వివరాలు సేకరించారు. 46 మందిని ఇప్పటికీ గుర్తించామని.. వీరికి పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.