ప్రాణాలు పోతున్నా లెక్కలేనితనం: విచ్చలవిడిగా శానిటైజర్ల సేవనం: జగన్ సొంతజిల్లాలో బహిరంగంగా
కడప: రాష్ట్రంలో మద్యం అమ్మకాల నియంత్రణ, దశలవారీగా ఎత్తివేత కార్యక్రమాలు నిరుపేదల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిన కొందరు మందుబాబులు శానిటైజర్లను తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లను సేవించడం వల్ల ప్రాణాలు పోతాయనే విషయంపై వారికి అవగాహన కల్పించడంలో అటు అధికార యంత్రాంగం కూడా పెద్దగా దృష్టి సారించకపోవడం దీనికి కారణమౌతోంది. శానిటైజర్లలో పరిమిత మోతాదు వరకు ఉండే అల్కహాల్ వల్ల మత్తులోకి జారుకోవడానికి అవకాశం ఉందని, దానివల్లే మందుబాబులు వాటిని సేవిస్తున్నారని అంటున్నారు.
బహిరంగంగా శానిటైజర్లు తాగుతూ..
ప్రకాశం జిల్లా కురిచేడు ఘటన మిగిల్చిన ప్రకంపనలు తగ్గక ముందే.. అలాంటి ఘటనలు మరి కొన్ని ప్రాంతాల్లో పునరావృతమైనప్పటికీ.. ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా కడపలో కొందరు వ్యక్తులు శానిటైజర్లను సేవిస్తూ కనిపించారు. బహిరంగంగా శానిటైజర్లను తాగుతున్నప్పటికీ.. ఎవరూ వారిని వారించే ప్రయత్నం చేయట్లేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు వ్యక్తులు పట్టపగలు శానిటైజర్లలో మంచినీటిని కలుపుకొ తాగుతూ కనిపించిన వీడియో అది.
పేదలకు మద్యాన్ని దూరం చేసినా.. శానిటైజర్ల రూపంలో..
రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించింది. ఇందులో భాగంగా వాటి రేట్లను భారీగా పెంచింది. పేదలకు మద్యాన్ని దూరం చేయాలనే కారణంతోనే వాటి రేట్లను ఆకాశానికి అంటుకునేలా పెంచేశారు. మద్య నియంత్రణ చర్యలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. దశలవారీగా మద్యం అమ్మకాలను నిషేధించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే పేదలకు మద్యాన్ని దూరం చేసింది. మద్యపానానికి బానిసగా మారిన వాళ్లు మాత్రం అందులో నుంచి బయట పడలేకపోతున్నారు. అల్కహాల్ మిశ్రమం ఉందనే ఏకైక కారణంతో శానిటైజర్లను తాగేస్తున్నారు.
కురిచేడు తరహా ఘటనలు..
కురిచేడులో శానిటైజర్లను తాగి 14 మంది మరణించిన ఘటన ఒకవంక ప్రకంపనలను సృష్టిస్తుండగానే.. ఈ సారి కడపలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శానిటైజర్లను మద్యంగా భావించి సేవించిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు గానీ.. ఏ మాత్రం వారు అధిక మోతాదులో దాన్ని తాగినా.. మృత్యుముఖంలోకి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఈ వీడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. శానిటైజర్లను తాగుతూ కనిపించిన వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు. శానిటైజర్లను తాగడం వల్ల మరణిస్తారనే విషయంపై ప్రచారం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు.
Recommended Video
చీప్ లిక్కర్లాగా..
మద్య నియంత్రణ చర్యలను ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనసాగించడం, అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, దాన్ని నివారించడానికి హ్యాండ్ శానిటైజర్లను విస్తృతంగా అమ్మకంలోకి తీసుకుని రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. చీప్ లిక్కర్ తరహాలోనే అల్కహాల్ మిశ్రమం ఉన్న శానిటైజర్ల ధరలు అందుబాటులో ఉండటం కూడా ఈ పరిస్థితి కారణమౌతోందని అధికారులు భావిస్తున్నారు. ఇదివరకు ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన శానిటైజర్లు కరోనా వల్ల ఇంటింటికీ అందుబాటులో ఉంటున్నాయని, అందులో ఉండే అల్కహాల్ కోసం మందుబాబులు వాటిని సేవిస్తున్నారని చెబుతున్నారు.