29 ఏళ్ల నాటి జంట హత్యల కేసు నుంచి టీడీపీ నేతకు ఉపశమనం!
కడప: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డికు ఊరట లభించింది. ఆయనపై నమోదైన షాద్ నగర్ జంట హత్యల కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం తుది ఆదేశాలను జారీ చేసింది. దీనితో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
మాయమైన ఐ ఇన్నాళ్లకు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశతో పేరు మార్చుకున్న మాజీ సీఎం!
తెలంగాణలోని షాద్నగర్ వద్ద 1990 డిసెంబర్లో జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు శివశంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి జమ్మలమడుగకు కారులో బయలుదేరిన వారు షాద్నగర్ వద్ద టీ సేవించడానికి ఆగారు. అదే సమయంలో- హైదరాబాద్ నుంచి కారును వెంటాడుతూ వచ్చిన ప్రత్యర్థులు వారిపై దాడి చేశారు. బాంబులు వేసి, భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం వేటకొడవళ్లతో నరికేశారు.
అప్పట్లో ఈ ఘటన పెను సంచలనాన్ని రేపింది. జమ్మలమడుగులో ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ప్రత్యర్థులకు సంబంధించిన ఆస్తులను విధ్వంసం చేశారు కాంగ్రెస్ మద్దతుదారులు. దాడులు, ప్రతిదాడులతో జమ్మలమడుగు అట్టుడికిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. అప్పటి నుంచీ షాద్నగర్ జంట హత్యల కేసు ఆయనను వెంటాడుతూ వస్తోంది. రామసుబ్బారెడ్డి సమీప బంధువు, మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఆ తరువాత హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వద్ద ప్రత్యర్థుల బాంబుదాడిలో శివారెడ్డి మరణించారు.
ఈ కేసులో 2004లో రామసుబ్బారెడ్డికి జైలు శిక్ష పడింది. రెండు సంవత్సరాల పాటు ఆయన హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవించారు. బెయిల్పై బయటికి వచ్చారు. అనంతరం ఈ కేసును హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామసుబ్బారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితుల కుటుంబీకులు సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. విచారణను కొనసాగించాల్సినంత మెరిట్ అప్పీల్లో లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై విచారణ అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.