వైఎస్ వివేకా హత్యకు సన్నిహితులే స్కెచ్ వేశారా?: రూ.50 కోట్ల పంపకాల్లో తేడా ఈ ఘాతుకానికి కారణమా?
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 150 కోట్ల రూపాయల విలువైన భూ సెటిల్ మెంట్ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందనే కొత్త వాదన తెర మీదికి వచ్చింది. వివేకా హత్య వెనుక రాజకీయ కోణం లేదని, కిరాయి హంతకుల పనేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు ఇదివరకే నిర్ధారించిన నేపథ్యంలో.. దర్యాప్తు మొత్తం ఈ కోణంలోనే కొనసాగుతోంది. తాజాగా- భూ సెటిల్ మెంట్ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
మావోయిస్టుల కదలికలు మళ్లీనా?.. ఎన్నికల బహిష్కరణకు తెలంగాణ కమిటీ పిలుపు
ఈ భూ సెటిల్ మెంట్ వ్యవహారంలో సుమారు 50 కోట్ల రూపాయల మేర పంపకాల్లో వచ్చిన తేడా వల్ల వైఎస్ వివేకనంద రెడ్డి హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి అనే పాత నేరస్తుడు వైఎస్ ను గొడ్డలితో నరికి చంపినట్లు అనుమానిస్తున్నారు. వివేకా కుడిభుజంగా చెప్పుకొనే ఎర్ర గంగిరెడ్డి ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు పోలీసులు. గంగిరెడ్డికి సన్నిహితుడైన పరమేశ్వర్ రెడ్డితో పాటు చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డిని మధ్యవర్తిగా పెట్టి, బెంగళూరులో 150 కోట్ల రూపాయల విలువ భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి గంగిరెడ్డి ప్రయత్నించారని పోలీసులు దర్యాప్తులో తేలిందట. బెంగళూరులో వైశ్య కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య 150 కోట్ల రూపాయల విలువ చేసే భూమి చాలాకాలంగా వివాదాల్లో నడుస్తోందని, ఈ వివాదాన్ని సెటిల్ చేస్తే.. మధ్యవర్తిత్వాన్ని వహించినందుకు కనీసం 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇచ్చేలా గంగిరెడ్డి డీల్ కుదుర్చుకున్నారని, వైఎస్ వివేకా ద్వారా దీన్ని సెటిల్ చేయించారని పోలీసులు చెబుతున్నారు. భూ సెటిల్ మెంట్ వ్యవహారం దాదాపు తుది దశకు చేరుకున్నదని కూడా తేలిందట. ఈ సమయంలో సదరు వైశ్య కుటుంబం ఇచ్చే 50 నుంచి 60 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎంత నిష్పత్తిలో పంచుకోవాలనే విషయంలో గంగిరెడ్డి, వివేకా మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఇదే విషయంపై వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకాను అడ్డు తొలగించుకుంటే.. మొత్తం 60 కోట్ల రూపాయలు తనకే దక్కుతాయని ఆశపడ్డ గంగిరెడ్డి.. కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చాడని తేలినట్లు అనుమానిస్తున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి అనే కిరాయి హంతకుడితో ఆరు కోట్ల రూపాయలతో వివేకాను హత్య చేసేలా డీల్ కుదుర్చుకున్నాడని స్పష్టమైంది. తనకు పరిచయం ఉన్న పరమేశ్వర్ రెడ్డి ద్వారా చంద్రశేఖర్ రెడ్డితో డీల్ ఓకే చేయించుకున్నాడని స్పష్టమైంది. వివేకాను హత్య చేయించాలనే విషయాన్ని గంగిరెడ్డి తొలుత పరమేశ్వర్ రెడ్డికి తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దీనికి ఏకీభవించిన పరమేశ్వర్ రెడ్డి.. తనకు పరిచయం ఉన్న పాత నేరస్తుడు చంద్రశేఖర్ రెడ్డిని రంగంలో దింపాడని సందేహిస్తున్నారు. రంగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు అంటున్నారు.
వివేకాను హత్య చేస్తే.. చంద్రశేఖర్ రెడ్డికి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చేలా పరమేశ్వర్ రెడ్డి గంగిరెడ్డిని ఒప్పించడాని అంటున్నారు. ఈ డీల్ కు గంగిరెడ్డి ఓకే చెప్పడంతో.. హత్యకు స్కెచ్ వేశారని అంటున్నారు. రంగేశ్వర్ రెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి గొడ్డలితో నుదుటిపై, తల వెనుక నరికి చంపిన తరహాలోనే, వివేకాను కూడా హత్య చేశారని గుర్తించారు. దీనిపై సిట్ పోలీసులు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ఆయా కోణాల్లో సిట్ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.