షర్మిల నిజంగానే జగన్ను ధిక్కరించబోతున్నారా... ఆ ప్రచారంలో అసలు లాజిక్ ఉందా...?
ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనంతో నిన్నటి నుంచి (జనవరి 24) 'వైఎస్ షర్మిల' చుట్టూ వాడి వేడి రాజకీయ చర్చలు,వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.జగనన్న ఎక్కుపెట్టిన బాణం రాజన్న రాజ్యం ఎక్కడంటూ ఆయన పైనే తిరుగుబాటు బావుటా ఎగిరేయబోతుందన్న కథనం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అయితే జగన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతుందని చెప్పడం... తండ్రి వైఎస్ను కాకుండా తాతా రాజారెడ్డిని ఆదర్శంగా తీసుకుంటావా ఆమె జగన్ను ప్రశ్నిస్తోందని చెప్పడం.... పూర్తి నిరాధారంగా,ఊహాజనితంగా కనిపిస్తున్నాయి. పైగా ప్రతీకారం తీర్చుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న కనీస లాజిక్ను కూడా మరిచి ఈ కథనాన్ని ఎందుకు వదిలారన్న చర్చ జరుగుతోంది.
Recommended Video
జగన్కు ఇంత అనుకూల వాతావరణం ఉన్నవేళ...
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని రెండేళ్లు కూడా పూర్తవలేదు. కానీ ఈ తక్కువ వ్యవధిలోనే ఆయన మెజారిటీ ప్రజలను సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకున్నారు. ఖజానాపై భారాన్ని సైతం లెక్క చేయకుండా చేతికి ఎముక లేదన్నట్లుగా ఆయన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. సంక్షేమ బాటలో ఆయన అనుసరిస్తున్నది వైఎస్ పంథానే అన్నది సుస్పష్టం. జగన్ అంటే గిట్టనివాళ్లు,ప్రత్యర్థులు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఆయన్ను విమర్శిస్తున్నా... ఒక్క అమరావతి ప్రజల నుంచి తప్ప ఈ రెండేళ్లలో జగన్పై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తమైన దాఖలా లేదు. ఈ కోణంలో చూస్తే.. రాష్ట్రంలో జగన్కు ఇంత అనుకూల వాతావరణం ఉన్న వేళ వైఎస్ షర్మిల సొంత కుంపటి పెట్టే ఆలోచన చేయగలుగుతుందా? అన్నది సాధారణంగా తలెత్తే ప్రశ్న.
లాజిక్ మిస్... తొందరపాటు చర్యే...?
రాజకీయమైనా... వ్యాపారమైనా... పోయిన చోటే వెతుక్కోవాలన్నది ఒక నానుడి. ఒకవేళ జగన్పై షర్మిల ప్రతీకార వాంఛతో రగిలిపోతుందన్నది నిజమే అయితే... ఆమె ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలి. కానీ అందుకు విరుద్దంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి జగన్పై ప్రతీకారం తీర్చుకోబోతుందని చెప్పడం కనీస లాజిక్ను కూడా మిస్సయినట్లే కనిపిస్తోంది. నిజానికి ఏ ప్రభుత్వానికైనా రెండేళ్ల కాలమన్నది అతి స్వల్ప వ్యవధి. ప్రభుత్వం తాము అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకైనా మరికొంత సమయం అవసరం. కాబట్టి జగన్పై ఇప్పుడే యుద్దం ప్రకటించడమన్నది తొందరపాటే అవుతుంది తప్ప మరొకటి కాదు. ఈ కనీస అవగాహన వైఎస్ షర్మిలకు ఉండదనుకోవడం కూడా పూర్తిగా నిరాధారపూరితంగా,ఊహాజనితంగానే కనిపిస్తోంది.
అన్నను ధిక్కరిస్తారా..?
తెలంగాణలో దుబ్బాక,జీహెచ్ఎంసీ వైఫల్యాలతో సీఎం కేసీఆరే రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిలను తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న వేళ ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ ఈ వ్యూహం రచించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా పలుచోట్ల కొంతమంది విద్యార్థులు,వ్యక్తులు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం బలమైన రాజకీయ శక్తిగా ఉండటం.. హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పటికీ వైఎస్ అభిమానం ఘనం భారీగానే ఉన్న నేపథ్యంలో... తెలంగాణలో పార్టీ దిశగా షర్మిల ఆలోచన చేసే ఆస్కారం లేకపోలేదు. అయితే అన్నను ధిక్కరించి ఆమె పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం మాత్రం సత్య దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తన చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ వ్యాఖ్యానాలు,చర్చలపై షర్మిల స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.