జగన్ గెలిస్తే.. ప్రమాణ స్వీకార అసలు ముహూర్తం ఇదే : ఇడుపులపాయలో మీటింగ్: ఢిల్లీ టూర్ ఖరారు..
Recommended Video
ఎన్నికల్లో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల వెల్లడి నుండి ఏం చేయాలో తన షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ నెల 22న అమరావతి సమీపంలోని ఉండవల్లికి చేరుకోనున్న జగన్.. 23న ఫలితాల సమయంలో పూర్తిగా అక్కడి కొత్త కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలోనూ ఫలితాలను పరిశీలించనున్నారు. ఆ వెంటనే తన కార్యక్రమాల షెడ్యూల్కు రూపు ఇచ్చారు...
23న ఫలితాల తరువాత...
22వ తేదీ అమరావతి చేరుకుంటున్న జగన్..23వ తేదీ నుండి పార్టీ కార్యాలయంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాలను వీక్షిస్తారు. ఫలితాల్లో తమ గెలుపు ఖాయమనే ధీమాలో జగన్ ఉన్నారు. దీనికి అనుగుణంగానే తన కార్యాచరణ ఖరారు చేసారు. ఫలితాలు తాము ఆశించిన విధంగా అనుకూలంగా వస్తే..ఆ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. 24వ తేదీ సైతం అమరావతిలోనే ఉంటారు. పూర్తి పార్టీ నేతలు..కార్యకర్తలకు సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. 25న ఇడుపుల పాయలో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఆ భేటీలో వైసీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా జగన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తరువాత గెలిచిన ఎమ్మెల్యేలు..ఎంపీలు వైయస్ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఆ సమయంలో జగన్ తన ప్రమాణ స్వీకార తేదీ..సమయం వెల్లడించనున్నారు.
26న ఢిల్లీకి జగన్...
ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సభ సీట్లు అధిక మొత్తంలో గెలుస్తానని ధీమాతో ఉన్న జగన్..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే..ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయి. ఫలితాల ఆధారంగా ఎవరికి అవకాశం వస్తుంది..ఎవరికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందనే లెక్కలతో ఆయన ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. అక్కడ పార్టీ సీనియర్లు సైతం జగన్తో ఉంటారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే రెండు ప్రధాన కూటములు జగన్ను మద్దతు ఇవ్వాలని కోరగా..ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుందామని జగన్ సమాధానం ఇచ్చారు. దీంతో..లోక్సభ ఫలితాల ఆధారంగా జగన్ ఢిల్లీ యాత్ర ఉండనుంది. అదే సమయంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని జగన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అదే విధంగా ఫలితాలు తనకు అనుకూలంగా ఉంటే..కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రముఖులను సైతం తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ప్రమాణ స్వీకార ముహూర్తం ఇదే..
ఎన్నికల్లో గెలిస్తే తొలుత ఈ నెల 26న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ పార్టీ నేతలు ప్రచారం చేసారు. అయితే, ఈ ముహూర్తం మారింది. జగన్ ఈ మధ్య కాలంలో విశాఖ స్వరూపానంద స్వామి నిర్ణయించిన ముహూర్తాల ప్రకారం నడుచుకుంటున్నారు. అందులో భాగంగానే..ఆయన ఈ నెల 30వ తేదీ జగన్ ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు జగన్ ప్రమాణ స్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయనతో పాటుగా పూర్తి స్థాయి కేబినెట్ సైతం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చాలా ధీమాగా ఉన్న వైసీపీ అధినాయకత్వం దీనికి కొనసాగింపులో భాగంగానే ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.