పెన్నా నదిలో గల్లంతైన వారి కోసం కొనసాగుతోన్న గాలింపు: సిద్ధవటం, తిరుపతిల్లో విషాదం
కడప: కడప జిల్లా సిద్దవటం వద్ద పెన్నానదిలో గల్లంతైన ఘటనలో అయిదు మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి తాత్కాలికంగా నిలిపివేసిన సహాయక చర్యలను ఈ తెల్లవారు జామున పునఃప్రారంభించారు. కడప జిల్లా కలెక్టర్ సీ హరికిరణ్, పోలీస్ సూపరింటెండెంట్ అన్బురాజన్, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుమంది గల్లంతు కాగా.. ఇద్దరి మృతదేహాలు రాత్రికే లభ్యమయ్యాయి. మిగిలిన అయిదుమంది కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు అన్వేషణ చేపట్టారు.
Recommended Video
సిద్ధవటంలోని దిగువ పేటకు చెందిన వెంకట శివ తండ్రి చంద్రశేఖర్ వర్థంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతి కొర్లగుంటకు చెందిన వెంకట శివ స్నేహితులు 10 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. అనంతరం వారంతా పెన్నా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు.
ఎనిమిది మంది నదిలో దిగగా..లోతు అధికంగా ఉండటంతో ఏడుమంది గల్లంతయ్యారు. వెంకట శివ ఒక్కడే ఒడ్డుకు చేరుకున్నాడు. అతని స్నేహితులు సోమశేఖర్, యశ్వంత్, తరుణ్, జగదీష్, రాజేశ్, సతీశ్, షన్ను గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృత దేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. మిగిలిన అయిదు మంది కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.
చీకటి, వర్షం వల్ల గురువారం రాత్రి గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారు జామున పుఃప్రారంభించారు. బ్రహ్మంసాగర్, అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ప్రత్యేకంగా బోట్లను తెప్పించారు. గజ ఈతగాళ్లతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకుంటున్నారు. అయిదుమంది పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరంగా మారింది. వారు ప్రాణాలతో ఉంటారని ఆశిస్తున్నారు. మృతులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం.. పాతికేళ్ల లోపు యువకులే కావడం వల్ల విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన పట్ల కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆరా తీశారు.