కడపలో అంగన్వాడీ టీచర్ మృతి... కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే...?
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టి.నారాయణమ్మ(58) అనే అంగన్వాడీ టీచర్ మృతి చెంది. పులివెందుల పట్టణానికి చెందిన నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్పటినుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారని... ఈ క్రమంలో కడప రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స తర్వాత కూడా నారాయణమ్మకు జ్వరం తగ్గలేదని... దీంతో గురువారం(ఫిబ్రవరి 18) ఆమెను ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. ఇంటికి వచ్చిన గంట సమయం లోపే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పలాస పట్టణంలో వాలంటీర్గా పనిచేస్తున్న లలిత(28) ఫిబ్రవరి 5న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఫిబ్రవరి 8న మృతి చెందింది. టీకా వికటించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లలితతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న 8 మంది వాలంటీర్లు,వీఆర్వో ప్రసాద్ స్వల్ప జ్వరం,తలనొప్పితో బాధపడ్డారు.
అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27) అనే స్థానిక అంగన్వాడీ టీచర్.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజులకే మృతి చెందారు.వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి వాంతులు,జ్వరం,విరేచనాలతో బాధపడ్డ ఆమె... ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకుముందు,నిర్మల్ జిల్లాలోనూ విఠల్(42) అనే అంబులెన్స్ డ్రైవర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24గంటల్లోపే మృతి చెందాడు. టీకా వికటించడం వల్లే విఠల్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.