వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో కదలిక: 3 నెలల తరువాత: పులివెందులకు సీబీఐ: ఇక ముమ్మరం
కడప: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కదలిక ఏర్పడింది. మూడు నెలల తరువాత మొదటిసారిగా సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయబోతోన్నారు. రాజకీయంగా ఇప్పటికీ దుమారాన్ని రేపుతోన్న ఆ హత్యోదంతంలో అసలు దోషులను గుర్తించడానికి లోతుగా దర్యాప్తు సాగించబోతోన్నారు సీబీఐ అధికారులు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. గురువారం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు అనంతరం రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరి వెళ్లారు. స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ హత్యోదంతంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇదివరకు చేపట్టిన కేసు వివరాలను సేకరించారు. న్యాయస్థానంలో రికార్డయిన స్టేట్మెంట్ను తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఇప్పటికే నలుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. వారి నుంచి రాబట్టిన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు.
పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో పొందుపరిచిన వివరాలు, ఇతర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం మరికొందరు అనుమానితులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దర్యాప్తును ముమ్మరం చేయడంలో భాగంగా.. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తారని సమాచారం. ఈ హైప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తులో ఇదే చివరిదశగా భావిస్తున్నారు.
వైఎస్ హత్యోదంతంలో ఎవరి ప్రమేయం ఉన్నది తెలియరాలేదు. తెలుగుదేశం నాయకుల చూపుడు వేళ్లు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే లేస్తున్నాయి. వైఎస్ వివేకా హత్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హస్తం ఉందంటూ పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా విమర్శలను గుప్పిస్తూ వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు గురైన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని, టీడీపీ నేతలే ఆయనను హత్య చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. అసలు దోషులెవరనేది సీబీఐ దర్యాప్తులో తేలనుంది.