ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఉన్మాదిలా మారి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో ఆమె చేతి వేళ్లు తెగిపోయి కిందపడ్డాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా... ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా తమ కుమార్తెను టార్చర్ పెడుతున్న ఆ ప్రేమోన్మాదిని వదలొద్దని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఘటన జరిగిన నేపథ్యం...
పోలీసుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరులోని నేతాజినగర్-3లో శ్రీనివాసులు-భారతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పట్టణంలోని కొత్త మార్కెట్లో వీరు కోడిగుడ్ల దుకాణం నిర్వహిస్తున్నారు.పెద్ద కుమార్తె లావణ్య ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేయగా... విజయవాడలోని ఓ బీటెక్ కాలేజీలో చేర్పించాలని తల్లిదండ్రులు భావించారు. ఇదే క్రమంలో గత కొద్ది నెలలుగా సునీల్ అనే యువకుడి నుంచి లావణ్య వేధింపులు ఎదుర్కొంటోంది. లావణ్య ఎక్కడ కనిపిస్తే అక్కడ సునీల్ ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. దీంతో అతని పేరు వింటేనే లావణ్య భయంతో వణికిపోయేది.
ఇంటికొచ్చి తలుపుకొట్టి.... కత్తితో తెగబడి...
శుక్రవారం(జనవరి 22) ఉదయం లావణ్య తల్లిదండ్రులు కొత్త మార్కెట్లోని తమ కోడిగుడ్ల దుకాణానికి వెళ్లారు. కుమార్తెను జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లారు. శ్రీనివాసులు-భారతి షాపులో ఉన్నారన్న విషయం తెలుసుకున్న సునీల్... నేతాజీనగర్లోని వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. వచ్చింది సునీల్ అని తెలియక లావణ్య తలుపు తీసింది. అంతే,ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా... వెంట తెచ్చుకున్న కత్తితో అతను ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె చేతి వేళ్లు తెగిపోయి కిందపడ్డాయి.
వదిలిపెట్టకండి సార్...
దాడి అనంతరం కత్తిని అక్కడే వదిలేసి సునీల్ పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న లావణ్యను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రి నుంచి కడప రిమ్స్కు తరలించారు. రక్తపు మడుగులో తడిసి ముద్దయిన బిడ్డను చూసి ఆమె తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. 'ఇష్టం లేదని చెప్పినా వెంటపడి వేధిస్తున్నాడు... రోజూ ఇద్దరు,ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకుని మా వీధిలోకి వచ్చేవాడు... 3 నెలల నుంచి నా బిడ్డను వేధిస్తూనే ఉన్నాడు. వాడిని వదిలిపెట్టకండి సార్...' అంటూ లావణ్య తల్లి భారతి కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రభుత్వం భరోసా...
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సునీల్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన లావణ్యను పలువురు స్థానిక అధికారులు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని లావణ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. పలు పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు కూడా లావణ్యను పరామర్శించినట్లు సమాచారం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.