కడప స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్- 500 కోట్ల ఈక్విటీ...టాటా, ఎస్సార్, హ్యుండాయ్ తో చర్చలు..
రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లోనూ మొదలుపెట్టాలనే సంకల్పంతో ఏపీ సర్కార్ ముందుకెళుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫున రూ.500 కోట్ల ఈక్విటీని కేటాయించాలని నిర్ణయించారు. అదే సమయంలో టాటా స్లీల్స్, ఎస్సార్ స్టీల్స్, హ్యుండాయ్ సంస్ధలను కూడా భాగస్వాములుగా చేసుకునేందుకు ఏపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.
స్టీల్ ప్లాంట్ కు వేగంగా అడుగులు...
కడప జిల్లా జమ్మల మడుగులో ఏర్పాటు చేయనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ( కడప స్టీల్ ప్లాంట్) కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటుకు శంఖుస్దాపన చేసిన ప్రభుత్వం... తదుపరి చర్యలపై దృష్టిసారిస్తోంది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం జగన్ అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం తరఫున ఈక్విటీగా రూ.500 కోట్లు కేటాయించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.
రంగంలోకి టాటా, ఎస్సార్, హ్యుండాయ్...
స్టీల్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అత్యుత్తమ కంపెనీలుగా ఉన్న టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్స్, హ్యుండాయ్ తో అధికారులు కడప స్టీల్ ప్లాంట్ పై చర్చలు జరుపుతున్నారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటవుతున్న ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు అధికారులు ఇప్పటికే ఆయా సంస్ధలతో చర్చలు జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ చర్చలు పూర్తవుతాయని, అప్పుడు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలవుతుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందించాలని జగన్ ఆదేశించారు.
Recommended Video
మౌలిక సదుపాయాల ఏర్పాటు...
కడప స్టీల్ ప్లాంట్ లో భాగస్వాములయ్యేందుకు టాటా, ఎస్సార్, హ్యుండాయ్ సంస్ధలు చేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. దీనిపై సమగ్రంగా చర్చించి రెండు నెలల్లో ఒప్పందాలకు ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశించారు. అలాగే ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్ట్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటు. ఆర్టీపీపీ లైన్ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.