2020లో కడప జిల్లా: కరోనా నుంచి నివర్ తుఫాను వరకు..సీఎం జగన్ సొంత జిల్లా విశేషాలు
కడప: 2020వ సంవత్సరం కడప జిల్లా ప్రజలకు ఎన్నో స్మృతులను మిగిల్చింది. ప్రజలు కరోనా వైరస్, నివర్ తుఫాన్ కష్టాలను ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో సీఎం జగన్ పర్యటనలతో, కడప జిల్లా రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పరిహారం కోసం ఆందోళనబాట పట్టిన గండికోట ప్రాజెక్టు నిర్వాసితులు నిత్యం వార్తల్లో నిలిచారు. ఇలా, 2020లో జిల్లాలో జరిగిన కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.
ఏప్రిల్లో జిల్లాలో తొలి కరోనావైరస్ కేసు
2020 వ సంవత్సరంలో కడప జిల్లా ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేసింది. ఏప్రిల్ 1న తొలిసారిగా జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ప్రస్తుతం 54 వేలకు పైగా చేరింది. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితులు ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అయితే, అధికారుల చర్యలతో ఇటీవల వైరస్ ప్రభావం తగ్గింది.
అర్థరాత్రి కడప నగరాన్ని ముంచెత్తిన వరద
ఆగస్టు 11న కడప జిల్లా మైలవరంలో, ట్రాక్టర్ బోల్తాపడి చిన్నవెంతుర్లకు చెందిన ఓ రైతు మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా, బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ను పక్కకు లాగే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్గా మారాయి.నవంబర్ 26 అర్ధ రాత్రి కడపను వరద నీరు చుట్టుముట్టింది. బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో, అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. దీంతో బుగ్గవంక పరివాహక ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో కడపలోని కొందరు జనాలు డాబాలపైకెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు.
వైరల్గా మారిన ఎస్ఐ గోపీనాథ్ రెడ్డి వీడియో
కడప జిల్లా పులివెందుల ఎస్ఐ గోపీనాథ్రెడ్డి సాహసం వీడియో 2020లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్నపల్లి రింగ్ రోడ్డు సమీపంలో తనిఖీలు చేస్తుండగా, ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఎస్సై గోపీనాథ్రెడ్డి ఒక్క ఉదుటున పరుగెత్తుకుంటూ వెళ్లి, ఎగిరి కారెక్కారు. అయినా ఆపకపోవడంతో మోకాలితో అద్దం పగలగొట్టి కారును ఆపారు. అక్రమ మద్యాన్ని, కారును సీజ్ చేసి, డ్రైవర్ను అరెస్టు చేశారు. సాహసం చేసిన ఎస్ఐను ఏపీ డీజీపీ అభినందించారు.
జమ్మలమడుగులో పురాతన ఆలయం
అక్టోబర్ 30 న జిల్లాలోని జమ్మలమడుగు మండలం సుగమంచిపల్లె దగ్గర పెన్నానదిలో పురాతన ఆలయం ఒకటి బయటపడింది. దీన్ని, రాజుల కాలం నాటి శివాలయంగా గుర్తించారు. ఇసుకలో ఉన్న ఆలయానికి సంబంధించిన శాసనాలు దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి. ఇసుకలో ఉన్న ఈ శివాలయం శాసనాల మీద పదవ శతాబ్దానికి సంబంధించిన, సంస్కృత భాష, ఇంకా కన్నడ అక్షరాలతో రాసి ఉంది.ఆగస్టు 29న జిల్లాలోని జమ్మలమడుగు మండలం బొమ్మేపల్లిలో జరిగిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గురు ప్రసాద్ అనే యువకుడు ఈత కోసం బావిలో దూకాడు. అంతలోనే బావిలోని మోటారు పైపుకు, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో గురు ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.