బరితెగించిన బలాదూర్.. ఎస్సై వాహనాన్నే ఢీ కొట్టి... అక్రమ మద్యం కోసం....
కొందరు తెగిస్తున్నారు. ఎంతలా అంటే తాము చేసే తప్పు ఎక్కడ బయటపడిపోతుందనే భయం వారిని వెన్నాడుతోంది. అడ్డొచ్చిన అధికారులు కాదు కాదు.. పోలీసులను కూడా లెక్కచేయడం లేదు. ఎదురిస్తున్నారు. మరికొందరు తమ వాహనాలతో ఢీ కొడుతున్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
ఏపీలో మద్యం సమయం కుదించడం, లిక్కర్ దొరకడం లేకపోవడంతో కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తున్నారు. ఇటీవల చెక్ పోస్టుల వద్ద భారీగా మద్యం పట్టుబడుతోంది. అయితే కడప జిల్లా పులివెందులలో ఎస్సై గోపినాథ్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారు దూసుకొచ్చింది. ఏకంగా ఎస్సైని ఢీ కొట్టి.. కాస్త దూరంగా లాక్కెళ్లింది.
అప్రమత్తమయిన ఎస్సై తప్పించుకున్నాడు. కారులో మద్యం సరఫరా అవుతుందనే సమాచారంతోనే తనిఖీ చేపట్టామని గోపినాథ్ రెడ్డి తెలిపారు. అయితే కారును ఆపేందుకు ప్రయత్నించగా ఢీ కొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడని వివరించారు. చాకచక్యంగా వ్యవహరించి..
కారు అద్దాలను పగలగొట్టామని చెప్పారు. తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కారులో ఉన్న 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా, కారుతో ఢీ కొట్టి ప్రయత్నించడంపై కేసు నమోదు చేశామని తెలిపారు.