జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! అర్హత లేదు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు
కడప: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజంపేట శాసన సభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. లోటస్పాండులో ప్రతిపక్ష నేతను కలిసి, వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
టీడీపీ నుంచి మేడా సస్పెన్షన్
రాజంపేటలో జరుగుతున్న పరిణామాలపై మేడా మల్లికార్జున రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. జగన్ను కలవడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడాను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. రాజంపేట కార్యకర్తల సమావేశంలోనే అధినేత సస్పెన్షన్ ప్రకటన చేశారు.
జగన్ ఇలాకాలో టీడీపీకి షాక్!: ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతున్నారా, ఏం జరిగిందంటే?
అనర్హుడికి అందలం ఎక్కించారని ఆగ్రహం
మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేతను కలుస్తున్నారనే విషయం తెలిసి రాజంపేటకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని ఆయనకు చెప్పారు. అనర్హుడికి అందలం ఎక్కించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీ నుంచి మేడాను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ఆ వెంటనే ప్రకటన చేశారు.
చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడా టీడీపీలో ఉండటానికి అనర్హుడు అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్లకు టీడీపీలో స్థానం లేదని స్పష్టం చేశారు. మధ్యలో వచ్చినవాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారన్నారు. టీడీపీకి కార్యకర్తలు మాత్రమే శాశ్వతం అన్నారు. సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలు రాజంపేట కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు. మేడా తండ్రికి టిడిపి సభ్యత్వం ఇస్తే అయిదేళ్లు అనుభవించి ఎన్నికలు రాగానే వెళ్లిపోయారన్నారు.
రాజంపేటకు కొత్త ఇంచార్జ్
కాగా, రాజంపేట నియోజకవర్గంలో మరో అభ్యర్థిని తెరపైకి తీసుకు వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున అసంతృప్తితో ఉన్నారు. మేడా లేకుండా ఇటీవలే మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజంపేట టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రెడ్ బస్ వ్యవస్థాపక సభ్యులు చరణ్ రాజును రాజంపేట ఇంచార్జిగా నియమించాలని నిర్ణయించారు. దీంతో మేడా టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.