టిఫిన్ బాక్సులో తల పెట్టి .. లోయలో పడేసి ..కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య
కడపలో దారుణ హత్య చోటు చేసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఒక విశ్రాంత ఉద్యోగిని తల నరికి, మొండెం నుండి వేరు చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. వారం క్రితం అదృశ్యమైన విశ్రాంత ఉద్యోగి వెంకట రమణయ్య మొండాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య ఇంట్లో గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా హత్యోదంతం వెలుగు చూసింది.
ఆర్ధిక లావాదేవీలతో రిటైర్డ్ ఉద్యోగి హత్య
విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య కనిపించడం లేదని ఈనెల 22వ తేదీన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట రమణయ్య తన ఉద్యోగ విరమణ అనంతరం ఎర్రగుంట్లలో పలువురికి వడ్డీలకు అప్పుగా డబ్బులు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వెంకట రమణయ్యమాజీ చైర్మన్ ముసలయ్యకు కూడా 50 లక్షల రుణం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ డబ్బుల కోసం ముసలయ్య దగ్గరకు వెళ్ళిన వెంకట రమణయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చారు ముసలయ్య.
లోయ దగ్గర దొరికిన తల , నిందితుడి ఇంట్లో మొండెం
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ముసలయ్య ఇంట్లో వెంకటరమణయ్య మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మొండాన్ని మాత్రమే ముసలయ్య ఇంట్లో గుర్తించి అతనిని అరెస్టు చేశారు.తల భాగం ఎక్కడుంది అన్నదానిపై ముసలయ్య ను విచారించిన పోలీసులకు టిఫిన్ బాక్స్ లో పెట్టి తలను కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్ లో పడేశారని పేర్కొన్నాడు .
Recommended Video
టిఫిన్ బాక్స్ లో తల పెట్టి పడేసిన నిందితుడు ... కేసు విచారణ
ఇక దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు టిఫిన్ బాక్స్ లో ఉన్న వెంకట రమణయ్య తలను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ముసలయ్య ఒక్కడే టిఫిన్ బాక్స్ లో తలను తీసుకువెళ్లి,గువ్వలచెరువు ఘాట్ వద్ద ఉన్న లోయలో పడేశాడా? లేక ఈ హత్యలో ఇంకెవరైనా పాల్గొన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతోనే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.