సీఎం సీటు కోసం కాంగ్రెస్కు 1500కోట్ల ఆఫర్ ,జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన ఫరూక్ అబ్దుల్లా
కడప : ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు తరఫున కడపలో ప్రచారం నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
వైఎస్ షర్మిలపై మరీ అంత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు .. కేసులో ఇరుక్కున్నాడు
వైసీపీ అధినేతపై ఫరూక్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేతపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఆయన ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉండారని విమర్శించారు. అలాంటి వ్యక్తి అధికారం చేపడితే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.
కాంగ్రెస్కు రూ.1500కోట్ల ఆఫర్
తండ్రి మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్కు 15వందల కోట్ల ఇస్తానని ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఒకవైపు తండ్రి శవాన్ని పెట్టుకుని మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం బేరాలాడిన జగన్ మాటలకు ప్రజలు మోసపోవద్దని అన్నారు. తన భవిష్యత్ మాత్రమే ఆలోచించే ఆయన అధికారంలోకి వస్తే ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోడన్న విషయాన్ని జనం గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి
ఏపీలో రాయలసీమ అత్యంత వెనకబడిన ప్రాంతమన్న ఫరూక్.. చంద్రబాబుకు మరోసారి అధికారం చేపడితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. బీళ్లు వారిన భూముల్లో నీళ్లు పారితే బంగారం పండుతుందని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా చంద్రబాబు రాయలసీమకు నీళ్లు రప్పిస్తారని ఫరూక్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైనా ఫరూక్ ప్రశంసలు గుప్పించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఆయనకు జనం మరోసారి ఆయనకు పట్టం కోరారు
బీజేపీవి అవకాశవాద రాజకీయాలు
అవకాశవాద రాజకీయాల్లో బీజేపీ దిట్ట అని ఫరూక్ ఆరోపించారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఇప్పుడు కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఇప్పుడు పాక్పై దాడుల గురించి మాత్రమే ఎందుకు గొప్పగా చెప్పుకుంటోందని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సఖ్యతతో ఉన్నప్పుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని, బీజేపీ మాత్రం ఆ విషయాన్ని మరిచి స్వలాభం కోసం పాకులాడుతోందని విమర్శించారు. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఫరూక్ అబ్దుల్లా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రూపంలో దేశానికి పట్టిన పీడ త్వరలోనే విరగడైపోవాలని ఆకాంక్షించారు.