చట్టసభలకు గౌరవం, ప్రాధాన్యత లేకుండా పోయింది అందుకే రాజీనామా: బీటెక్ రవి
అమరావతి: మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఓ వైపు సంబురాలు మిన్నంటుతుండగా మరో వైపు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ పలువురు నిపుణులతో చర్చించి ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే విశాఖలో కర్నూలులో సంబురాలు అంబరాన్నంటాయి. వైయస్ జగన్ ఫోటోకు పార్టీ కార్యకర్తలు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు పాలాభిషేకం చేశారు.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలెక్ట్ కమిటీ ముందు ఉన్న బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక తాజాగా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయంపై నిరసన తెలుపుతూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు బీటెక్ రవి. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం పై ఆయన నిరసన తెలుపుతూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానంటూ బీటెక్ రవి చెప్పారు. మండలి ఆమోదించని బిల్లులు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలకు గౌరవం, ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టసభల్లో ఉండలేక కలతచెంది తాను రాజీనామా చేస్తున్నట్లు బీటెక్ రవి చెప్పారు.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల బిల్లుల ఆమోదం, సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలపడంపై అమరావతి పరిరక్షణ సమితి తీవ్రంగా స్పందించింది. రాజధాని వికేంద్రీకరణ పేరుతో అమరావతికి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తింది. గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం దురదృష్టకర నిర్ణయం అని పేర్కొంది. ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరోటి లేదని అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతుల నమ్మకాన్ని దెబ్బతీశారని మండిపడింది. ఇక గవర్నర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ వ్యవహారంలో ఎలాగైతే న్యాయం జరిగిందో తమకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది అమరావతి పరిరక్షణ సమితి. రెండు రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే ఐక్యకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది .
Recommended Video
మొత్తానికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్ద చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రెండు ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా అమరావతి ప్రాంతం మాత్రం భగ్గుమంది.