వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ స్పీడప్, బీటెక్ రవికి సిట్ నోటీసులు, ఆదినారాయణ కూడా..?
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను స్పీడప్ చేసింది. హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరీని విచారిస్తోంది. గత 9 నెలల నుంచి కేసు విచారణను దర్యాప్తు బృందం చేస్తుంది. ప్రతీరోజు రెండు పార్టీలకు చెందిన నేతలను పిలిచి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు అధికారులు పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్ .. వివేకా సోదరులు, టీడీపీ నాయకుల రహస్య విచారణ
మిగతావారికి నోటీసులు
వివేకా హత్య కేసులో అనుమానితులు చెప్పిన వివరాలను బట్టి మిగతావారికి నోటీసులు జారీచేస్తున్నారు. విచారణకు హాజరుకావాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీచేశారు. గురువారం బీటెక్ రవిని అధికారులు ప్రశ్నిస్తారు. విచారణలో ఆయన చెప్పే సమాధానాలను బట్టి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి.
డ్రైవర్ దస్తగిరి విచారణ
బుధవారం డ్రైవర్ దస్తగిరి, ప్రకాశ్ను సిట్ అధికారులు విచారించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కొందరు అనుమానితులను పుణె తీసుకెళ్లి నార్కొ అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు. కానీ హత్యకు సంబంధించి నిందితులను మాత్రం కనుగొనలేకపోయారు.
స్పీడ్ తగ్గి.. అంతలోనే
వివేకానంద హత్య కేసు విచారణ మధ్యలో వేగం తగ్గింది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం సొంత బాబాయ్ హత్య నిందితులను పట్టుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఎంక్వైరీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో... సిట్ తన దర్యాప్తు స్పీడ్ మరింత పెంచింది.
బంధువుల విచారణ
కేసులో ఇప్పటికే వైఎస్ మనోహర్ రెడ్డి, టీడీపీ నేత కోరటి ప్రభాకర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా మిగతావారికి నోటీసులు జారీచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేశారు. భాస్కర్ రెడ్డి, పనిమనిషిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు సందేహం కలిగిన వ్యక్తుల గురించి వారు తెలియజేయగా.. వారికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు.