కడపలో ఏం జరుగుతోంది..? పొలిటికల్ కక్షలా.. ఉన్మాద చర్యలా..! సోలార్ ప్యానల్స్ ను ద్వంసం..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చేందుకు కొందరు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. విగ్రహాలకు మసి పూయడం, ద్వంసం చేయడం, ప్రభుత్వ శిలా ఫలకాలను కూల్చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతూ సమాజంలో అలజడి వాతావరణాన్ని సృష్టిస్తుంటారు. అంతే కాకుండా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అనేక దుర్మార్గాలు కూడా చేస్తుంటారు కొందరు ఉన్మాదులు. సరిగ్గా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ ప్టేట్స్ ను ద్వంసం చేసి వైశాచిక ఆనందం పొందారు. వాటి విలువ సుమారు 3కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
1,700 సోలార్ పలకలు ధ్వంసం..! గుర్తుతెలియని వ్యక్తుల చర్య..!!
కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని రామచంద్రాయపల్లె సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ కేంద్రంలో 1,700కు పైగా సోలార్ పలకలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు సోలార్ అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలోని 16వ ప్లాంటులో ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
3 కోట్ల మేర నష్టం..! రెచ్చిపోయిన ఉన్మాదులు..!!
సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది సోలార్ అధికారులకు తెలిపారు. దీంతో సోలార్ అధికారులు ఉదయ్, దస్తగిరిరెడ్డి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు రూరల్ సీఐ మంజునాఽధ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్ సిబ్బందితో అక్కడకు చేరుకుని సోలార్ పలకలను ధ్వంసం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందితో జరిగిన సంఘటనపై ఆరాదీశారు.
కడపలో కల్లోలం..! విచారణ ముమ్మరం చేసిన పోలీసులు..!!
సోలార్ అధికారులు దస్తగిరి రెడ్డి, ఉదయ్ పోలీసులతో మాట్లాడుతూ ప్రస్తుతం 250 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ పరిశ్రమ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రాంతంలో పనులు జరిగాయన్నారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాదాపు 1,700లకు పైగా సోలార్ పలకలను గొడ్డలి, తదితర ఆయుధాలతో ధ్వంసం చేసినట్లు తెలిపారు.
అదను చూసి ద్వంసం..! వర్షం పడుతున్న వేళ అరాచకం..!!
దీంతో దాదాపు మూడు కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. సెక్యూరిటీ గార్డులు అక్కడ విధులు నిర్వహించేందుకు సరైన వసతి లేదు. ఆదివారం రాత్రి గాలి, తేలిక పాటి చిరుజల్లులు పడుతుండడంతో సెక్యూరీటి గార్డులందరూ వసతి ఉన్నచోటుకు వెళ్లారని, ఆ సమయంలో దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.