కరోనా బారిన జేసీ ప్రభాకర్ రెడ్డి: కడప సెంట్రల్ జైలులో తోటి ఖైదీలకూ: ఆందోళనకరంగా
కడప: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దీనితో ఆయనకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న దళిత ఇన్స్పెక్టర్ను దూషించిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇదే జైలులో 317 మంది ఖైదీలకు కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. 14 మంది జైలు సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలిపారు.
తిరుగుబాటు..ప్రభుత్వం కూల్చివేత: బందీలుగా దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి: మంత్రుల ఇళ్లల్లో లూటీ
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కొద్దిరోజుల కిందట బెయిల్పై విడుదల అయ్యారు. విడుదల అనంతరం వారు తమ అనుచరులు, అభిమానులతో కలిసి కడప కేంద్ర కారాగారం నుంచి వాహనాల ర్యాలీని నిర్వహించారు. ర్యాలీగా అనంతపురం జిల్లా తాడిపత్రికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తాడిపత్రి సమీపంలో సజ్జలదిన్నె వద్ద ఇన్స్పెక్టర్ దేవేంద్ర వారిని అడ్డుకున్నారు. వాహనాల ర్యాలీని నిర్వహించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దూషించారు.
అప్పట్లో ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేశారు. మళ్లీ కడప కేంద్ర కారాగారానికే తరలించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు జైలు అధికారులు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఆయనతో పాటు 317 మంది ఖైదీలు, 14 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారించారు. వారిని ప్రత్యేక గదుల్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జైలులో 700 మంది ఖైదీలు ఉన్నారని, వారందరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. కుటుంబ సభ్యులతో మిలాఖత్ సందర్భంగా కరోనా సోకి ఉంటుందని, ఒకరిద్దరి ద్వారా వ్యాప్తి చెంది ఉండొచ్చని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయనను ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పౌష్టికాహారాన్ని ఇస్తున్నామని పేర్కొన్నారు.