టీడీపీ నేత హత్యతో ఉలిక్కిపడిన పల్నాడు ..గురజాలకు లోకేష్ ..జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ అంటూ ధ్వజం
రాష్ట్రంలో టిడిపి నేతలు వరుసగా హత్యకు గురవుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల హత్యల వెనుక అధికార వైసిపి నేతలు ఉన్నారని విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ . మొన్నటికి మొన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో సుబ్బయ్య హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా గుంటూరు జిల్లా గురజాలలో టిడిపి నేత హత్య టిడిపి శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
టీడీపీ నేత దారుణహత్యతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది .
గొంతు కోసి టీడీపీ నేత పురంశెట్టి అంకులు హత్య
అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ టీడీపీ కీలక నేత పురం శెట్టి అంకులు నిన్న సాయంత్రం ఒక ఫోన్ కాల్ రావడంతో ఒంటరిగా దాచేపల్లి వెళ్లారు. కారును రోడ్డు పై పార్క్ చేసి నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో కి వెళ్లిన ఆయన మొదటి అంతస్తులో హత్యకు గురయ్యారు. మాట్లాడి వస్తానని వెళ్ళిన అంకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ అపార్ట్ మెంట్ లోకి వెళ్లి చూడగా రక్తపుమడుగులో విగతజీవిగా టిడిపి నేత అంకుల్ మృతదేహం కనిపించింది. అత్యంత పాశవికంగా అంకులు గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్యకు నిరసనగా అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై రాస్తారోకో .. యరపతినేని ఆరోపణలు
దీంతో టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యను నిరసిస్తూ అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై రాస్తారోకో దిగారు .గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, పెదగార్లపాడు వైసిపి నేతలు, పోలీసులు ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపణలు గుప్పించారు. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలను టార్గెట్ చేసి చంపుతున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి రాక్షసానందం ఇది : లోకేష్ మండిపాటు
టిడిపి నేత అంకులు హత్య నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని, మొన్న ప్రొద్దుటూరు, ఇప్పుడు గురజాలలో వరుసగా టిడిపి నేతలను హత్య చేయించి ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు ను దారుణంగా గొంతు కోసి హతమార్చారు వైసీపీ రౌడీలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా ? ప్రశ్నించిన లోకేష్
జగన్ రెడ్డి హత్య రాజకీయాలను ఖండిస్తున్నాను అని లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ గా పదిహేనేళ్ల పాటు పనిచేసి గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన పురంశెట్టి అంకులు ను రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ గుండాలు హత్య చేయడం దారుణమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు ఉన్నాయా అని ఆక్రోశం వెళ్లగక్కారు. కత్తి నమ్ముకున్న వాడు అదే కత్తి బలైపోయాడు అనే సత్యాన్ని జగన్ రెడ్డి గ్రహించాలని లోకేష్ పేర్కొన్నారు .
గురజాల వెళ్లనున్న లోకేష్ .. అంకులు అంత్యక్రియల్లో టీడీపీ నేత లోకేష్
అంతే కాదు టిడిపి నేత అంకులు హత్య నేపథ్యంలో ఈ రోజు నారా లోకేష్ గురజాల నియోజక వర్గానికి వెళ్లి అంకులు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు . అంకులు కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పెదగార్లపాడు గ్రామం చేరుకోనున్న లోకేష్ అంకులు అంత్యక్రియలలో పాల్గొననున్నారు.