కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. కళ్లల్లో కారం కొట్టి,కత్తులు దూసి... వైసీపీ పనే అన్న చంద్రబాబు...
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. సోమలవారిపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలంలోనే సుబ్బయ్యను హతమార్చారు. రాజకీయ ప్రత్యర్థులే సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
టీడీపీ జిల్లా ప్రతినిధి అయిన నందం సుబ్బయ్య ఇటీవల సోషల్ మీడియాలో పలు రాజకీయ విమర్శలతో కూడిన పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ వర్గానికి సుబ్బయ్యకు మధ్య తీవ్ర విమర్శలు,ప్రతి విమర్శలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుబ్బయ్యపై రాజకీయ కక్ష పెంచుకున్న వైసీపీ నేతలు ఆయన హత్యకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సుబ్బయ్య హత్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య బాధాకారమన్నారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను హత్య చేశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుబెట్టడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేసినందునే హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టీడీపి నాయకుడి హత్య సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు అన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సుబ్బయ్య హత్యను ఖండించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నాయకుడి హత్య రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ పాలనలో హింస జరగని రోజు లేదన్నారు. రాష్ట్రంలో కత్తులు,కర్రలు,మారణాయుధాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.