నా భర్త చావుకు ఎమ్మెల్యే , ఎమ్మెల్యే బావమరిదే కారణం ...టీడీపీ నేత సుబ్బయ్య భార్య ప్రమాణం
వైసీపీ నేత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, టిడిపి నేత సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు లోని చౌడేశ్వరి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. అయితే తన భర్త చావుకు కారణం ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి అని టిడిపి నేత సుబ్బయ్య భార్య అపరాజిత కూడా సత్య ప్రమాణం చేయడం కడప జిల్లాలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
ప్రొద్దుటూరులో టీడీపీనేత సుబ్బయ్య అంత్యక్రియలలో పాల్గొన్న నారాలోకేష్ .. శవరాజకీయాలని వైసీపీ ఫైర్
ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసిన టీడీపీ నేత, హతుడు సుబ్బయ్య భార్య
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమాణంపై సుబ్బయ్య భార్య అపరాజిత స్పందించారు. నా భర్త హత్యతో సంబంధం లేదని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. దేవుడు ముందు ప్రమాణం చేసినంత మాత్రాన చేసిన తప్పు ఏదో ఒక రోజు బయటికి రాకుండా పోదు. నేను నా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు మునిరెడ్డి నా భర్తను చంపాడు అని అపరాజిత పేర్కొన్నారు. అంతేకాదు ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకుండానే బంగారు రెడ్డి తన భర్తను చంపి ఉంటాడా అంటూ ప్రశ్నించారు అపరాజిత.
తన భర్తను చంపిన ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి ప్రమాణం చెయ్యాలని డిమాండ్
తన భర్తను చంపిన వ్యక్తి ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి అని ఆరోపణలు గుప్పిస్తున్న అపరాజిత , ఇన్ని రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నా బంగారు రెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తాను తన పిల్లలపై ప్రమాణం చేసి బంగారు రెడ్డిపై చెబుతున్నాను కాబట్టి, నిజంగానే బంగారు రెడ్డి తనకు ఈ హత్యతో సంబంధం లేదు అనుకుంటే ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు.
తన భర్త సుబ్బయ్య పై ఎమ్మెల్యే ఆరోపణలు అసత్యాలన్న అపరాజిత
ఇప్పటికే తను తన భర్తను కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని, పిల్లలపై ప్రమాణం చేసి అసత్యం మాట్లాడాల్సిన అవసరం లేదని , ఒకవేళ తాను చెప్పింది తప్పైతే పిల్లలను కూడా నష్టపోతానని అపరాజిత పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు తన భర్తపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అపరాజిత, వైసీపీ నాయకుల అరాచకాలు బయటపెట్టిన అందుకే తన భర్తను దారుణంగా హతమార్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కడపలో సత్యప్రమాణాల లొల్లి .. టీడీపీ నేత హత్యతో కొనసాగుతున్న రగడ
మొత్తానికి కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి నేత హత్య నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకరిని మించి ఒకరు చేస్తున్న సత్య ప్రమాణాలు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ కేసులో టిడిపి నేత సుబ్బయ్యను హతమార్చింది మేమేనని ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. లొంగిపోయిన వారిని విచారిస్తున్న పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య మిస్టరీని పోలీసులు ఎప్పటి వరకు చేదిస్తారు అన్నదానిపై ప్రస్తుతం కడపలో చర్చ జరుగుతోంది.