కడపజిల్లాలో టెన్షన్.. వైసీపీ,టీడీపీ వర్గాల ఘర్షణ .. కొడవళ్ళు,రాళ్ళతో దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు, దాడుల నేపధ్యంలో దారుణమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నా వాటిని నివారించటానికి ఎలాంటి ప్రయత్నమూ జరగటం లేదు . ఫలితంగా గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కూడా ఘర్షణలు తారా స్థాయికి చేరి కొడవళ్ళు, రాళ్ళతో దాడులకు పాల్పడ్డారు వైసీపీ , టీడీపీ కార్యకర్తలు .
ఎన్నికల తర్వాత నుండీ నేటి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో దాడుల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కొడవళ్లతో దాడికి దిగాయి.ఈ ఘటనలో గాయపడిన 11 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుమారకాల్వ గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అసలు వీరు ఎందుకు ఇంతగా దాడులకు పాల్పడ్డారు, వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ వెనక కారణాలుఏంటీ అనేది పోలీసులు విచారిస్తున్నారు. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పు రావటం లేదు .ఇక ఈ దాడుల్లో గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. అధికార, విపక్ష పార్టీల వర్గాల మధ్య ఘర్షణలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.