కడప ఎన్టీఆర్ నగర్ లో ఉద్రిక్తత .. గుడిసెల కూల్చివేత ..ఆత్మహత్యా యత్నం చేసిన బాధితులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ నిరుపేదల గుడిసెలు సైతం కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
గంటాకు జగన్ సర్కార్ షాక్ ... అనుమతుల్లేవని గంటా క్యాంప్ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధం
వైసిపి కంచుకోటగా భావించే కడప జిల్లాలో, ఏపీ సీఎం గా కడప బిడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండగా కడపలోని ఎన్టీఆర్ నగర్ లో పేదల గుడిసెలను అధికారులు కూల్చివేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
కడపలోని ఎన్టీఆర్ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలు గత 25 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అయితే అవి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలని, వాటిని కూల్చివేయడానికి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గుడిసెలను కూల్చివేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ఇక్కడ జీవనం సాగిస్తున్నామని అధికారులను ప్రాధేయపడినప్పటికీ అధికారులు మాత్రం అవేవి పట్టించుకోకుండా పోలీసుల సహకారంతో నిరుపేదల గుడిసెలను కూల్చివేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు, తమకు నిలువనీడ లేకుండా చేశారని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఎన్టీఆర్ కాలనీ వాసులు ఇది వైసీపీ నేత చేసిన కుట్ర అని , వైసీపీ నేతలు స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పిన వాళ్లు తాము టీడీపీకి అనుకూలంగా ఉన్నామన్న కారణంతోనే తమ గుడిసెలు కూల్చివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారుల కాళ్లు పట్టుకుని బ్రతిమలాడినా వినకుండా అధికారులు చాలా కర్కశంగా ప్రవర్తించారని, తమ గుడిసెలను కూల్చేశారని కాలనీవాసులు కన్నీటిపర్యంతం అయ్యారు.