భగవద్గీత నేర్పిస్తానని గుడికి రమ్మని: గిరిజన బాలికపై అత్యాచారం చేసిన పూజారి
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోయాయి. నిన్నటికి నిన్న వరంగల్ లో మానస అత్యాచార ఘటన, ఆ తరువాత రంగారెడ్డి జిల్లా , షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచార, హత్య ఘటన మరిచిపోకముందే మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక అని కూడా చూడకుండా ఓ కీచక పూజారి చేసిన ఘాతుకం బయటకు వచ్చింది.
కడపజిల్లాలో దారుణం .. రామాలయం పూజారి చిన్నారిపై అఘాయిత్యం
భగవద్గీత నేర్పిస్తానంటూ ఓ కామాంధుడైన పూజారి దారుణానికి ఒడిగట్టారు. భగవద్గీత నేర్పిస్తానని 14 సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూజారి ఘాతుకం కడప జిల్లా సుండుపల్లె మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం కడప జిల్లాలో సుండుపల్లె మండలం రాయవరం గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన 35 సంవత్సరాల దేరంగుల రవి అలియాస్ సత్యనారాయణ నాలుగు సంవత్సరాలుగా జీకే రాచపల్లెలోని రామాలయంలో పూజారిగా పని చేస్తున్నారు.
భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్న పూజారి .. పరీక్ష పెడతానని గుడికి రమ్మన్న రవి
ఇక పూజారి అప్పుడప్పుడు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి భగవద్గీత గురించి బోధించేవారు. ఈ క్రమంలోనే గత 20 రోజులుగా రామాలయంలో పిల్లలకు భగవద్గీత శ్లోకాలు బోధిస్తున్నారు. అయితే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్న క్రమంలో ఓ చిన్నారికి పరీక్ష పెడతానంటూ రామాలయానికి రావాలని చెప్పారు పూజారి. దీంతో 8వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక పరీక్ష రాయడం కోసం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రామాలయానికి వెళ్ళింది.
పరీక్ష ప్యాడ్ మర్చిపోయి తెచ్చుకోవటానికి వెళ్ళిన క్రమంలో ఘాతుకం
ఇతర విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో బాలిక ఒక్కతే పరీక్ష రాసి తిరిగి ఇంటికి బయలుదేరింది అయితే పరీక్ష రాసిన అట్ట మరచి పోవడం తో దానిని తెచ్చుకునేందుకు తిరిగి రామాలయానికి వెళ్లిన బాలికను ఆలయం వెనుక ఉన్న గదిలో పరీక్ష ప్యాడ్ ఉందని వెళ్లి తెచ్చుకోమని పూజారి చెప్పాడు. దీంతో గదిలోకి వెళ్లిన బాలిక పరీక్ష ప్యాడ్ తీసుకునే క్రమంలో వెనుక వెళ్ళిన పూజారి తలుపు గొళ్ళెం పెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను బెదిరించిన పూజారి .. ఇంట్లో చెప్పిన బాలిక .. కేసు నమోదు
మధ్యాహ్నం నుంచి గదిలోని ఉంచుకొని సాయంత్రం 6 గంటలకు బాలికను బెదిరించి బయటకు పంపించాడు. అయితే బాలిక ఏడుస్తూ వచ్చి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పూజారి పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూజారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గా పోలీసులు తెలిపారు.