నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
కడప : కాసేపట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ క్రతువు మొదలవుతోంది. కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభమై .. పదిరోజులపాటు కొనసాగుతాయి. ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
చైత్రశుద్ధ పౌర్ణమి రోజు కల్యాణం ..
శ్రీరామనవమి రోజున అన్ని ప్రముఖ ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించడం మనకు తెలుసు. ఒంటిమిట్టలో మాత్రం దీనికి భిన్నంగా చైత్రశుద్ధ పౌర్ణమి నాటి రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. 18న గురువారం జరిగే కల్యాణానికి లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. కల్యాణవేదిక వద్ద ఒకేసారి లక్ష మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లను చేశారు.
ధ్వజరోహణంతో అంకురార్పణ
శనివారం 13న వృషభలగ్నంలో ధ్వజారోహణంతో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం పోతన జయంతి నిర్వహించారు. 16న హనుమంత వాహనం చేపట్టారు, 18న సీతారాముల కల్యాణం, 19న రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 21న చక్రస్నానం, ఏప్రిల్ 22న పుష్పయాగం కార్యక్రమాలను చేపడతారు. స్థానికుల కోరిక మేరకు శ్రీవారి లడ్డూలను ఒంటిమిట్టలో విక్రయిస్తున్నారు.
కల్యాణం కమనీయం ..
14న వేణుగాన అలంకారం, స్వామివారిని హంస వాహనంపై ఊరేగింపు, 15న వటపత్రసాయి అలంకారం, సింహ వాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. 16న నవనీత కృష్ణ అలంకారం, సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగించారు. 17న మోహినీ అలంకారం, సాయంత్రం గరుడసేవను నిర్వహించారు. 18న శివ ధనస్సు అలంకారం, అదే రోజు రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం గజవాహన సేవ ఉంటుంది. 19న రథోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. 20న కాళీయమర్ధన అలంకారం, అనంతరం అశ్వవాహన సేవ. 21న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుంది. 22వ తేదీన పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
గాలి, దుమారం ...
గతేడాది వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాత్రం గాలి దుమారం ఇబ్బంది పెట్టాయి. గాలి, వాన బీభత్సంతో ఏర్పాటుచేసిన టెంట్లు కూలిపోయి .. అక్కడికొచ్చిన స్థానికులు ఇబ్బందిపడ్డారు. ఏడాదికోసారి కన్నుల పండుగగా జరిగే బ్రహ్మోత్సవాలు గతేడాది వరణుడు, వాయు అడ్డుపడిన విషయాన్ని స్థానికులు కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఈసారైనా తమను కరుణించాలని స్థానికులు కోరుతున్నారు.