వివేకా కేసు .. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరన్న ఆదినారాయణ రెడ్డి
మాజీ మంత్రి , సీఎం జగన్ బాబాయి వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సిట్ మీద నమ్మకం లేదని , సీబీఐ దర్యాప్తు చెయ్యాలని పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు .
వైఎస్ వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్ .. వివేకా సోదరులు, టీడీపీ నాయకుల రహస్య విచారణ
సీబీఐ లేక రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని తన పిటీషన్ లో కోరారు. అదే సమయంలో ఈ కేసును విచారిస్తున్న సిట్ వైఖరిని చూస్తే..అమాయకులను కేసులో ఇరికించేలా ఉందని పేర్కొన్న ఆయన తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. వివేకా కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న ఆదినారాయణ రెడ్డి హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని..తనకు హత్యతో ప్రమేయం లేదని ఏ మాత్రం సంబంధం ఉన్నా నడిరోడ్డుపైన ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన ఆయన వివేకా హత్యకేసును విచారణల పేరుతో జగన్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వివేకాను ఎవరు హత్య చేశారో జగన్ అంతరాత్మకు తెలుసన్నారు.
జగన్ కు అన్నీ తెలుసు కాబట్టే వివేకా హత్యకేసు దర్యాప్తు ఇలా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినా ఆయన హత్యకు కారకులెవరో కనిపెట్టలేదని చెప్పారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న సామెత వివేకా కేసుకు అక్షరాలా వర్తిస్తుందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకంలేకే సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.