జాతీయ పార్టీల మద్దత్తు ఉంది..! ప్రత్యేక హోదా సాధించేందుకు ఎలాంటి అడ్డంకి లేదన్న బాబు..!!
కడప/హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు తమకు సహకరిస్తున్నాయని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్క బీజేపీ మాత్రమే వ్యతిరేకంగా ఉందని వెల్లడించారు. కడపలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. కడపలో ఎప్పటినుంచో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న అమీర్ బాబుకు టికెట్టిచ్చామని గుర్తు చేసారు. ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నా పార్టీ విజ్ఞప్తి మేరకు ఎంపీగా వెళ్లేందుకు సిద్ధమయ్యార బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. కుట్ర రాజకీయాల కోసం మన జీవితాలతో ఆడుకుంటే అడ్రస్ గల్లంతు చేస్తామని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
రాష్ట్రాభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నాం. త్వరలో వృద్ధాప్య పింఛను 2 వేల రూపాయల నుంచి 3 వేల రూపాయలకు పెంచుతామని, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇస్తున్నానని. మైనారిటీల కోసం హజ్ హౌస్లను నిర్మిస్తున్నామని, ఇమామ్లకు 10 వేలు, మౌజమ్లకు 5 వేల రూపాయలు జీతం రూపంలో ఇస్తామని బాబు ప్రకటించారు. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన మోదీకి బుద్ధి చెప్పాలరని, మోదీ, కేసీఆర్, జగన్ కలిసి నాటకాలాడుతున్నారని బాబు మండిపడ్డారు. టీడిపి నేతలకు, వైకాపా అభ్యర్థులకు మధ్య పోలిక ఉందా? అని బాబు ప్రశ్నించారు.