పవన్ కళ్యాణ్తో కలిసి.., ఎన్టీఆర్ను గెలిపించినట్లుగానే నేనే గెలుస్తా: జగన్ 'రియల్ స్టోరీ'
కడప: తాను అధికారంలోకి రాగానే కడప ఉక్కు కర్మాగారంపై దృష్టి సారిస్తానని, దానిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని, మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో పూర్తి చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కడపలో జరిగిన సమరశంఖారావం సభలో అన్నారు.
చంద్రబాబు గురించి మూడు ముక్కల్లో
ఎల్లో మీడియాను వాడుకొని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ దొంగ సర్వేలు చేస్తారని జగన్ మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబు గురించి మూడు నాలుగు లైన్లలో చెప్పాలంటే.. ఆయన మూడు సినిమాలు తీశారని, అందులో ఒకటి 2014లో చూపించిన హామీల సినిమా అని, ఎన్నో డైగాలుగులు చెప్పారని, కానీ ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ, పోలవరం ప్రాజెక్టుపై సినిమా డైలాగులు కొట్టారన్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని చెప్పారని, అన్ని నగరాల చుట్టు రింగ్ రోడ్డు వేస్తానని చెప్పాడని, ఎన్నికల ప్రణాళికలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించి, ప్రతి కులాన్ని మోసం చేస్తూ డైలాగ్లు రాశారన్నారు. తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చేశారా అన్నారు.
దెబ్బకు దెబ్బ: ఇదీ దెబ్బంటే, ఏం చేయలేనిస్థితి.. చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన జగన్
బీజేపీ, పవన్ కళ్యాణ్తో కలిసి...నాలుగేళ్లు ముంచాడు
బీజేపీ, పవన్ కళ్యాణ్తో కలిసి (2014 ఎన్నికల్లో) గెలిచిన తర్వాత నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేస్తాడని, ఎన్నికలకు మూడు నెలలు, ఆరు నెలల ముందు సినిమాలు తీస్తారని, డైలాగులు చెబుతారన్నరు. నాలుగున్నరేళ్ల పాటు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు ధర్మపోరాటం అంటూ నాటకాలు ఆడుతారన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఒప్పుకోకుండా నాలుగు నెలలు, ఆరు నెలల ముందు డ్రామాలు చేస్తున్నారన్నారు. ఆ డ్రామా పేరు పసుపు - కుంకుమ అన్నారు. సాధారణంగా ప్రతి ముఖ్యమంత్రి ఐదు బడ్జెట్లు ప్రవేశపెడతారని, ఆయన మాత్రం ఆరో బడ్జెట్ ప్రవేశపెడతారన్నారు. తనకు అధికారం లేని బడ్జెట్ను ప్రవేశపెడతారన్నారు.
ఎన్టీఆర్ను గెలిపించినట్లుగా నాకు గెలుపు
57 నెలలు (అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లకు పైగా) మన కడుపు మాడ్చి, ఇప్పుడు అన్ని ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని జగన్ అన్నారు. నాడు ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం అని చెబితే, అప్పుడు కాంగ్రెస్ సీఎం విజయభాస్కర రెడ్డి రూ.1.90 పైసలకే బియ్యం ఇచ్చారని, కానీ ప్రజలు మాత్రం ఆయనకు ఓటేయలేదని, ఎన్టీఆర్కు ఓటేశారన్నారు. కారణం.. నాలుగున్నరేళ్ల పాటు పాలనను గాలికి వదిలేసి ఆరు నెలల ముందు ఎన్టీఆర్ చెప్పినందుకు.. ఆయన అమలు చేశాడు కాబట్టి ఆ కాంగ్రెస్ సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. గట్టిగా బుద్దొచ్చేలా చేశారన్నారు. ఇప్పుడు తన హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని, కాబట్టి ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తల్లికి అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పినట్లుగా చంద్రబాబు చెప్పినట్లుగా ఉందన్నారు.