కడప చేరుకున్న వైఎస్ జగన్! రేపట్నుంచి పులివెందులలో ప్రజాదర్బార్
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కడపకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన సాయంత్రానికి కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తన స్వస్థలం పులివెందులకు బయలుదేరి వెళ్లారు. రెండురోజుల పాటు వైఎస్ జగన్ పులివెందులలోనే ఉంటారు. బుధ, గురువారాల్లో ఆయన అక్కడే ఉంటారు. పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం లేదా.. శుక్రవారం ఉదయం ఆయన మళ్లీ హైదరాబాద్కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్ జగన్ అందుబాటులో లేని సమయంలో పార్టీ కీలక నాయకులు దీన్ని నిర్వహిస్తుంటారు.
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించడానికి, వారి అభిప్రాయాలను సేకరించడానికి ప్రజా దర్బార్ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. వేసవిలో పులివెందుల నియోజకవర్గం పరిధిలో మంచినీటి సమస్య, సాగునీటి సమస్య, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఆయా అంశాలతో పాటు స్థానిక విషయాలు కూడా ప్రజాదర్బార్లో ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది.