వైఎస్ వివేకా హత్యోదంతం: నిందితుల రిమాండ్ పొడిగింపు..పులివెందుల జైలుకు తరలింపు!
కడప: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుల రిమాండ్ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈ మేరకు సోమవారం పోలీసులకు అనుమతి ఇచ్చింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ రెడ్డిలను పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి రిమాండ్ సోమవారం నాటితో ముగిసింది.
దీనితో కడప కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్న ఈ ముగ్గురినీ పోలీసులు పులివెందుల న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. రిమాండ్ను పొడిగించాలని పోలీసులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కిశోర్ కుమార్ రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా- ప్రస్తుతం కడపలోని కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్న ముగ్గురు నిందితులు పులివెందులలోని ఉప కేంద్ర కారాగారానికి తరలించారు. కడప నుంచి పులివెందులకు తరలించాలని నిందితులు తమ తరఫు వాదిస్తోన్న న్యాయవాది ద్వారా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలనలోకి తీసుకుంది. కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకు తరలించడానికి అనుమతి ఇచ్చింది.