వైఎస్సార్కు నివాళి అర్పించిన జగన్: ఆయన మా బావ: మోహన్బాబు: అవినాష్ రెడ్డి గైర్హాజర్
కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్దే అరగంట పాటు గడిపారు.
తమ మధ్య నుంచి వైఎస్సార్ దూరమై నేటికి 11 ఏళ్లు నిండాయని, ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ.. ఆయన రూపొందించిన పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని వైఎస్ జగన్ అన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ వైఎస్సార్ తోడుగా ఉంటారని చెప్పారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ఆయన అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటలకు తాడేపల్లికి చేరుకోవాల్సి ఉంది.
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.#YSRVardhanthi #YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2020
వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాయచోటి పార్టీ ఇన్ఛార్జి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ పాల్గొన్నారు. పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినప్పటికీ.. ఆయన పక్కనే కనిపించే కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఇటీవలే ఆయనకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. కరోనా వల్ల తాను వైఎస్సార్ ఘాట్కు రాలేకపోయానని ఆయన వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఘాట్ను సందర్శిస్తానని, వైఎస్సార్కు నివాళి అర్పిస్తానని చెప్పారు.
Recommended Video
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్ బాబు ఆయనకు నివాళి అర్పించారు. వైఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రాజకీయవేత్త అని నివాళి అర్పించారు. మా బావగారు అంటూ మోహన్బాబు ట్వీట్ చేశారు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు తమకు తోడు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.