సోనియాగాంధీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు.. కానీ: సన్నిహితుల వద్ద వైఎస్ జగన్!
కడప: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలతాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించుకుంటుందటూ సర్వేలన్నీ స్పష్టం చేస్తోన్న నేపథ్యంలో- ఢిల్లీ నాయకులు ఏపీ వైపు చూపులు సారించారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తులు పెట్టుకోవాలని, ఆ పార్టీ మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఇప్పటికే- వైఎస్ జగన్తో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్తో ఫోన్లో సంభాషించినట్లు తెలిసింది. కాస్త ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ కూడా లైనులోకొచ్చింది. స్వయంగా యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాలు వెలువడే రోజైన ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి రావాలని సోనియా కబురు పంపించినట్లు తెలుస్తోంది.
నాది సింగిల్ అజెండా!
ప్రస్తుతం తన స్వస్థలం కడప జిల్లా పులివెందులలో ఉంటోన్న వైఎస్ జగన్ వద్ద ఇదే విషయం ప్రస్తావనకు రాగా.. ఆయన ప్రతికూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. తనుక పార్టీలు, సంకీర్ణ కూటములతో ఏ మాత్రం సంబంధం లేదని, వాటిని తాను పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకుని రావాలనే సింగిల్ అజెండాతోను తాను పనిచేస్తున్నానని చెప్పారు `దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే- రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపైనే దృష్టి పెడదాం..జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పటం మనకెందుకు?.. దానికి ఇంకా చాలా సమయం ఉంది..` అని వైఎస్ చెప్పుకొచ్చినట్లు ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. `మనకు ఒక సింగిల్ అజెండా ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావాలి. స్టేటస్ ఎవరు ఇస్తారో, వారికే మద్దతు ఇద్దాం..` అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తానని, ఇందులో మరో మాటకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
లిఖితపూరకంగా హామీ ఇస్తేనే..
వ్యక్తిగతంగా సోనియా గాంధీ ముఖాన్ని కూడా తాను చూడాలని కోరుకోవట్లేదని వైఎస్ జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని లిఖితపూరకంగానే హామీ ఇస్తే- అయిష్టంగానైనా సోనియా గాంధీని కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బిజేపీ అయినా కాంగ్రెస అయినా లేదా ఇంకో పార్టీ అయినా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకి మద్దతు ఇద్దామని, తాను ముందు నుంచీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నానని అన్నారు. హోదా సాధన విషయంలో రాజకీయాలు చేయాలని తాను కోరుకోవట్లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారని అంటున్నారు.
తటస్థ పార్టీలకు లేఖలు..
ఎన్డీఏ, యూపీఏ కూటములకు సమదూరాన్ని పాటిస్తూ, తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్లకు సోనియాగాంధీ ఆహ్వానం పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకోగలిగితే- కేంద్రంలో అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను సులభంగా అందుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా- వైఎస్ జగన్ సహా తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్లకు ఆమె లేఖలు రాసినట్లు చెబుతున్నారు.
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్..
పులివెందులలో పర్యటిస్తోన్న వైఎస్ జగన్ను స్థానిక నూర్భాషా సంఘం ముస్లింలు కలిశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనాలని ఆహ్వానించారు. వారి కోరిక మేరకు బుధవారం రాత్రి ఆయన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనాలు చేశారు. పులివెందులలోని వీజే ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు వైఎస్ జగన్తో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.