'హైకోర్టు సాక్షిగా బయటపడిన దొంగతనం': వైసీపీకి 2014 కంటే తక్కువ సీట్లు వస్తాయా?
అమరావతి: డేటా చోరీ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై సోమవారం నిప్పులు చెరిగారు. ఆయన తన వరుస ట్వీట్లలో టీఆర్ఎస్, వైసీపీలపై విమర్శలు గుప్పించారు.
హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది
హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందని ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. తెల్ల కాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి ఉద్యోగులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.
ఏపీ ఓటర్ల డేటా కేసు : న్యాయమూర్తి ఎదుట ఐటీ గ్రిడ్ ఉద్యోగులు
రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇస్తాడనుకోలేదు
రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ గతంలో చెప్పారని, అంటే ఏపీకి వచ్చి దొంగబ్బాయి వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని భావించానని, కానీ డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ను దెబ్బతీస్తారని అనుకోలేదని లోకేష్ విమర్శించారు. నలుగురు ఐటీ ఉద్యోగుల అరెస్టు అక్రమని హైకోర్టు ద్వారా తేలిపోయిందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కస్టడీలోకి ఎలా తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించిందని, అంతేకాకుండా, బ్లాక్ పేపర్ల పైన వీఆర్వో సిగ్నేచర్ తీసుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారని లోకేష్.. తెరాసపై ఆరోపణలు చేశారు. ఏపీ వ్యతిరేక శక్తులు అన్నీ కలిసి ఒక్క చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నాయని, దీనిని ఏపీ ప్రజలు చూస్తున్నారన్నారు.
వైసీపీకి 30 సీట్లు కూడా రావని పీకే సర్వేలో తేలింది
ఏపీలో ఓట్ల గల్లంతుపై హైదరాబాదులో ఎలా ఫిర్యాదు చేస్తారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు వేరుగా ప్రశ్నించారు. దొంగ ఫిర్యాదులు చేసేవారు వైసీపీ అధినేత జగన్లా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ప్రశాంతి కిషోర్ సర్వేలోనే వైసీపీకి 30 సీట్లకు మించి రావని తేలిందన్నారు. పీకే లోటస్ పాండులో కూర్చొని టీడీపీ అనుకూల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధించాలని కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈసారి అందులో సగం కూడా రావని టీడీపీ అంటోంది.