83 శాతం పట్టభద్రులు వ్యతిరేకించారు.. టీఆర్ఎస్కు ఇది గుణపాఠమే : జీవన్ రెడ్డి
కరీంనగర్ : తెలంగాణలో ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ హవా తగ్గుతోందా? ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో దూకుడు పెంచిన గులాబీదండుకు ఇప్పుడేమైంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు బొర్లాబొక్కా పడింది? నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నిక్కచ్చిగా సమాధానాలిచ్చారు నయా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 83 శాతం పట్టభద్రులు వ్యతిరేకించారంటే టీఆర్ఎస్కు తగిన గుణపాఠమే అని వ్యాఖ్యానించారు.
పట్టభద్రుల ఆకాంక్ష మేర పనిచేస్తా : జీవన్ రెడ్డి
రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ దండు బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ కు చెందిన సమీప ప్రత్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై 39,430 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం తనకెంతో శక్తినిచ్చిందని.. పట్టభద్రుల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని తెలిపారు.
టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ దెబ్బ.. 3 స్థానాల్లో ఔట్.. కాంగ్రెస్కు కొత్త శక్తి..!
83 శాతం వ్యతిరేకత.. ప్రతిపక్షం లేకుంటే వ్యర్థమే
ప్రతిపక్షాలు బలహీనమైతే రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనకు తెర లేస్తుందన్నారు జీవన్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 17 శాతం ఓట్లు పోలవ్వడం గమనార్హం అన్నారు. 83 శాతం వ్యతిరేకించారంటే
చదువుకున్న యువతకు.. టీఆర్ఎస్ విధానాలు నచ్చడం లేదని అర్థమవుతోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నిధులు, నియామకాలు, నీళ్ల ప్రతిపాదికన ఏర్పడిందన్నారు. ఆనాటి ఉద్యమంలో యువత ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. విద్యార్థిలోకం, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు... ఉద్యోగవకాశాలు మెరుగవుతాయని భావించారు. ఆ క్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలు కూడా చేశారని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ తీరు.. యువతలో నిరాశ..!
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ ఐదేళ్ల కాలంలో కుటుంబ పాలన కనిపించిందే తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకోసం.. ఓటు, సీటు తప్ప నిరుద్యోగ యువత గురించి ఆలోచించకపోవడం, పట్టభద్రులను పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదమన్నారు. అందుకే వారిలో పెరిగిన నిరాశ నిస్పృహకు అద్దం పట్టే విధంగా.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేత మురళీధర్ రావుపై 2 కోట్ల ఛీటింగ్ కేసు.. కథలో ట్విస్టులెన్నో..!
ప్రభుత్వాన్ని నిలదీస్తా..!
ఏదైనా సరే పరిష్కారం కావాలంటే సమస్య తెలియాలి. అలా ప్రజాస్వామ్యంలో సమస్యలు లేవనెత్తేవాళ్లు కావాలి. చట్టసభల ద్వారా సమస్యలు లేవనెత్తి ప్రశ్నించగలిగితేనే ప్రభుత్వం స్పందిస్తుంటుంది. ప్రజాస్వామ ప్రక్రియలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అపొజిషన్ నేతలు బలంగా పనిచేయగలిగితేనే ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరుగుతుంది. విపక్ష ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తేనే.. ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇవాళ ప్రజల పక్షాన, పట్టభద్రుల పక్షాన నిలబడగలిగే వ్యక్తిగా.. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా నన్ను గుర్తించారు. అందుకే ఎమ్మెల్సీగా పట్టం కట్టారు. ఆ మేరకు శాసన మండలి పదవీకాలంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వంపై వత్తిడి తేవాలనే భావనతో నిరుద్యోగులు తనను ఎన్నుకున్నారని చెప్పారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు వారి హక్కుల సాధన కోసం తమ ప్రతినిధిగా తనను మండలికి పంపించారని తెలిపారు. అందుకే వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ.. ప్రజా సంక్షేమానికి పాటుపడతానన్నారు.