కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!
కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. వ్యవసాయదారుడైన తన తండ్రి పనుల కోసం అటు ఇటు తిరిగి అలసిపోతుండటంతో ఓ బైక్ కానుకగా ఇచ్చి తన తండ్రి కష్టాన్ని దూరం చేశాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన లింగయ్య అనే రైతు తన పొలం పనుల కోసం నడుచుకుంటూనే వెళ్లి వచ్చేవారు. రోజు అలా వెళుతూ అలసిపోయి ఇంటికి వచ్చేవారు. తన తండ్రి కష్టం చూసిన అతని కొడుకు.. ఏదో విధంగా సాయం చేయాలని అనుకున్నాడు. ఏదైనా బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు.
అయితే, లీటర్ పెట్రోల్ ధర రూ.70-80 ఉండటంతో తండ్రికి మరింత ఖర్చులు పెరుగుతాయని ఆలోచించాడు. దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాటరీ బైక్ కొనివ్వాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ బైక్ కొని తన తండ్రికి కానుకగా ఇచ్చాడు. దీంతో ఆ తండ్రికి సుదూరాలు నడిచే కష్టం తప్పింది.
వ్యవసాయ పనులు, కాయగూరలు, యూరియా బస్తాలు తెచ్చుకునేందుకు తనకు ఎంతో సౌకర్యంగా ఈ బ్యాటరీ ఆటోమెటిక్ బైక్ ఉందని లింగయ్య సంతోషం వ్యక్తం చేశారు. తన కొడుకు ఇచ్చిన కానుక తనకు బాగా నచ్చిందని తెలిపారు.
అంతేగాక, స్థానికులు తనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. అంతా ఈ బైక్ కారణంగానేనని చెప్పుకొచ్చారు. ఏదైమైనా కొడుకు ఇచ్చిన కానుక లింగయ్య కష్టాలను దూరం చేసిందని చెప్పుకోవచ్చు.