బాప్రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!
కరీంనగర్ : తెలంగాణ లోక్సభ ఫలితాలు రాష్ట్ర బీజేపీలో జోష్ నింపాయి. నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయి పార్లమెంటరీ బరిలో విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ తొలిసారిగా చట్టసభలకు వెళుతున్నారు.
అదలావుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల కన్నా ఎక్కువ ఓట్లు సాధించి కూడా కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఓడిపోయారు. రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలిచి ముందువరుసలో నిలిచారు. బీజేపీ లీడర్లలో ఆయనకే మెజార్టీ ఓట్లు ఎక్కువగా రావడం విశేషం.
ఏమంటారు కేటీఆర్.. చెల్లని రూపాయిల లెక్క తేలిందా..!
బీజేపీలో బండి సంజయే నెంబర్ వన్..!
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సెగ్మెంట్ అన్ని రాజకీయ పార్టీలను ఆదరించింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్.. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులను అక్కున చేర్చుకుంది. బీజేపీ ఇక్కడ గెలవడం కొత్త కాకున్నా.. బండి సంజయ్ గెలవడం మాత్రం కచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకునే విషయం. గతంలో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఇక్కడ నుంచి గెలుపొందారు.
అయితే తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది బండి సంజయ్కే కావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై 89 వేల 508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అర్వింద్కు 70 వేల 875 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి 62 వేల 114 ఓట్ల మెజార్టీ.. ఆదిలాబాద్ నుంచి విజయం సాధించిన సోయం బాపురావు 58 వేల 560 ఓట్ల మెజార్టీ సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ.. అత్యధిక 'షేర్' బండిదే
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 7 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి పోలైన 14 లక్షల 50 వేల 456 ఓట్లలో హైదరాబాద్ గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్కు 61 వేల 854 ఓట్లు రాగా.. అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్ రెడ్డికి 60 వేల 542 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్కు 66 వేల 9 ఓట్లు పోలయ్యాయి. అలా బీజేపీలోనే టాప్ గా నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఓటమి చెంది రెండో స్థానానికి పరిమితమైనా.. బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా పడ్డ ఓట్లలో ఆయనదే అత్యధిక "షేర్" కావడం విశేషం.
కరీంనగర్ బీజేపీకి కేరాఫ్ అడ్రస్..!
ఒకరకంగా చెప్పాలంటే కరీంనగర్ జిల్లా బీజేపీకి జవసత్వాలు నింపిన నాయకుడు ఎవరంటే బండి సంజయ్ అని చెప్పొచ్చు. కార్యకర్తల్లో భరోసా నింపుతూ, తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇన్నాళ్లుగా రాష్ట్ర నాయకత్వం అతడిని సరైన రీతిలో గుర్తించలేదనే వాదనలున్నాయి. ఇసుక లారీలతో దళితులను చంపిన నేరెళ్ల ఘటనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ తన శక్తినంతా ధారపోశారు. బాధితులకు అండగా నిలిచారు. పైగా నేరెళ్ల క్రెడిటంతా బండి సంజయ్ కు దక్కుతుందనే కారణంతో అగ్రనేతలంతా దూరంగా ఉన్నారట.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బండి సంజయ్.. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. రాష్ట్ర పార్టీ నేతలపై విసుగు చెందారో ఏమో గానీ ఒకానొక దశలో పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బండి సంజయ్ లాంటి యువనాయకుడు పార్టీని వీడితే కష్టమే అనే చర్చ సాగింది. ఆ నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకుల చొరవతో చివరకు బండి సంజయ్ తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు.
బావతో బామ్మర్ది ఛాలెంజ్ ఏమాయే.. మెదక్ గెలిచే.. కరీంనగర్ పాయే..!
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి.. ఇకపై కూడా అందుబాటులో ఉంటే..!
కరీంనగర్ బీజేపీ అంటే బండి సంజయ్.. బండి సంజయ్ అంటే కరీంనగర్ బీజేపీ అనే రీతిలో ఆయన కష్టపడ్డారు. పార్టీనే నమ్ముకుని పార్టీ కోసమే పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సంజయ్.. పార్టీకి సేవలందించడానికి పగలనక, రాత్రనక శ్రమించారు. అదే ఇవాళ ఆయనను కేంద్ర నాయకత్వం గుర్తించడానికి కారణమైంది. ఆయనను ఎంపీగా గెలిపించింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ బండి సంజయ్ ఓడిపోతే కార్యకర్తలు కంటతడి పెట్టిన సందర్భాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే బలమైన కాంక్షతో రగులుతున్న బండి సంజయ్ మొత్తానికి ఎంపీగా గెలిచారు. ఇకపై కూడా పాత పద్దతిలోనే ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేనట్లే.